చెన్నై: భారతీయ వరి సాగుపై జరిగిన ఒక వివరణాత్మక అధ్యయనం ప్రకారం.. ఒక కిలో బియ్యం పండించడానికి సగటున 1,500 నుంచి 2,000 లీటర్ల నీరు అవసరం. వర్షాలపై ఆధారపడకుండా భూగర్భ జలాలను విపరీతంగా తోడేసే పంజాబ్, హర్యానా వంటి రాష్ర్టాల్లో ఈ కిలో బియ్యానికి 2,270 నుంచి 2,672 లీటర్ల వరకు అవసరమవుతాయి. భారతదేశం ఉపయోగించే మొత్తం మంచినీటిలో దాదాపు 90 శాతం వ్యవసాయానికే ఖర్చవుతున్నది.
చెరుకు పంటకు కూడా భూమి ఎప్పుడూ తడిగానే ఉండాలి. భారతదేశపు అత్యున్నత సాంకేతిక సంస్థల్లో ఒకటైన ఐఐటీ మద్రాస్లో ఒకరు ఈ సమస్యవైపు దష్టి సారించారు. ఐఐటీ మద్రాస్ ‘ప్రిసిషన్ అగ్రికల్చర్’ అని పిలిచే విధానంపై దృష్టి సారిస్తున్నదని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వీ కామకోటి తెలిపారు.తక్కువ నీటిని ఉపయోగిస్తూ వరి, చెరుకు వంటి పంటలను పండించడమే ఈ కచ్చితత్వ వ్యవసాయం ముఖ్య ఉద్దేశమని అన్నారు.
‘మిషన్ ప్రవర్తక్’ అనేది ఐఐటీ మద్రాస్ సొంత టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్. సెన్సార్లు, నెట్వర్క్లు, కంట్రోల్ సిస్టమ్లు దీని ప్రధాన రంగాలు. కచ్చితత్వ వ్యవసాయం రూపుదిద్దుకోవడానికి సరిగ్గా ఈ సాంకేతికతలే అవసరం. ‘ప్రిసిషన్ అగ్రికల్చర్’ కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ను ఎలా ఉపయోగించాలో కెనడా భాగస్వాములతో కలిసి ప్రవర్తక్ ఇప్పటికే ఉమ్మడి వర్క్షాప్లను నిర్వహించింది. ప్రిసిషన్ అగ్రికల్చర్ అంటే ఒక్క మొక్కకు ఎంత అవసరమో అంతే ఇవ్వడం, ఒక్క బొట్టు కూడా ఎక్కువ ఇవ్వకపోవడం. ఆచరణలో మూడు అంశాలు కలిసి పనిచేస్తాయి. నేలలో పాతిపెట్టిన సెన్సార్లు తేమను కొలుస్తాయి. రైతు ఊహించి నీరు పెట్టడానికి బదులుగా, పంటకు ఎప్పుడు దాహం వేస్తుందో నేలే చెప్తుంది.
పొలమంతా నీటితో ముంచెత్తి వృథా చేయకుండా, మొక్క వేర్లకు ఎంత కావాలో అంతే కొలత ప్రకారం చుక్కల రూపంలో నీటిని అందిస్తుంది. పైనుంచి నిఘా ఉంచే శాటిలైట్లు, డ్రోన్లు పొలంలో ఏ భాగంగా పైరు సరిగ్గా పెరుగడం లేదో ముందే పసిగడుతాయి. వరి విషయానికి వస్తే ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ అనే పద్ధతి ద్వారా అంటే పొలాన్ని ఎల్లప్పుడూ నీటిలో ఉంచకుండా, నీరు పెట్టిన తర్వాత కొద్దిగా ఆరనివ్వడం ద్వారా దిగుబడి తగ్గకుండా నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు ఇప్పటికే నిరూపించారు. మారుతున్న వాతావరణం, పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల పంటలకు నీటి దాహం మరింత పెరుగుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో కచ్చితత్వ వ్యవసాయం అనేది భారత్కు ఎంతో అవసరం. తగ్గిపోతున్న నీటి వనరులతో భవిష్యత్తులో భారత్ తనకు తాను ఆహారాన్ని అందించుకోగలదా లేదా అనేదానికి ఇది సమాధానం.