పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో ఐఈడీ బాంబు పేలి 35 మంది పౌరులు మృతి చెందగా, మరో 37 మంది గాయపడ్డారు. చనిపోయిన 35 మంది సాధారణ పౌరులేనని అధికారులు వెల్లడించారు. సైన్యం రక్షణలో పౌరులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న కాన్వాయ్లోని వాహనం ఐఈడీ బాంబు దాడికి గురైందని గవర్నర్ రోడోల్ఫ్ సోర్గో ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సంఘటన జిబో, బౌర్జాంగా మధ్య జరిగింది. కాన్వాయ్ ఉత్తరం నుంచి బుర్కినా రాజధాని ఔగాడౌగౌకు వెళ్తోంది. ఐఈడీ పేలగానే ఎస్కార్ట్లు అప్రమత్తమయ్యారు. బాధితులకు సహాయక చర్యలు చేపట్టారు. ఆగస్టు ప్రారంభంలోనూ అదే ప్రాంతంలో డబుల్ ఐఈడీ బాంబు పేలి 15 మంది సైనికులు మరణించారు. ఉత్తరాదిలోని ప్రధాన నగరాలైన డోరి, జిబోలకు వెళ్లే రహదారులను జిహాదిస్ట్ గ్రూపులు లక్ష్యంగా చేసుకున్నాయి. ఇటీవల ఇలాంటి దాడులు నిర్వహించాయి. అల్-ఖైదా లేదా ఇస్లామిక్ స్టేట్ గ్రూపుతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న జిహాదీల నేతృత్వంలో సహెల్ రాష్ట్రంలో తిరుగుబాటు నడుస్తోంది. ఇప్పటివరకూ 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 1.9 మిలియన్ల మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టాల్సి వచ్చింది.