లండన్, ఏప్రిల్ 16 : పశ్చిమాసియా యుద్ధం సెగ ఇప్పుడు వైమానిక రంగాన్ని కూడా తాకింది. యూరప్లో ఆరు వారాలకు సరిపడా జెట్ ఇంధనం మాత్రమే మిగిలి ఉందని, ఇరాన్-యూఎస్ యుద్ధ సంక్షోభం ఇలాగే కొనసాగితే విమానాల రద్దు త్వరలోనే ప్రారంభం అవుతుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ హెడ్ ఫాతిహ్ బిరోల్ గురువారం హెచ్చరించారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా హొర్ముజ్ జలసంధి వద్ద రవాణా నిలిచిపోయిందని, దీంతో ఆయిల్, గ్యాస్, ఇతర ముఖ్యమైన సరఫరాలకు తీవ్ర ఆటంకం ఏర్పడిందని, ఇది గతంలో ఎన్నడూ ఎదుర్కోని అతి పెద్ద ఇంధన సంక్షోభం అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణంపై చెడు ప్రభావం చూపుతుందని అన్నారు.
గ్యాస్, పెట్రోల్, విద్యుత్తు చార్జీలు అధికం కావడం ద్వారా అది ప్రజలపై పెను భారాన్ని మోపుతుందని అన్నారు. ప్రస్తుత ఎనర్జీ సంక్షోభం కారణంగా భారత్, పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్, జపాన్ దేశాలు అత్యధికంగా ప్రభావితం అయినట్టు గుర్తించామని తెలిపారు. ఈ సంక్షోభం కారణంగా, ఎక్కువగా నష్టపోయేది ఎవరి గొంతుక వినిపిస్తుందో వారు కాదని, ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాలేనని ఆయన పేర్కొన్నారు. హొర్ముజ్ జలసంధి వద్ద వాణిజ్య నౌకలకు ఇరాన్ టోల్ విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని ఆయన తప్పుబడుతూ ఇదే విధానాన్ని ఆసియాలోని మలక్కా జలసంధితో పాటు పలు ప్రాంతాల్లో అమలు చేస్తారని విమర్శించారు.