Joe Biden | అమెరికా-చైనా మధ్య నెలకొన్న స్పై బెలూన్ (Chinese Spy Balloon) వివాదం కొనసాగుతోంది. ఇటీవలే అమెరికా గగనతలంలో చక్కర్లు కొడుత్ను చైనా నిఘా బెలూన్ను అమెరికా యుద్ధ విమానాలు కూల్చేసిన విషయం తెలిసిందే. ఆ బెలూన్ నిఘా కోసం ఉద్దేశించినదని అమెరికా ఆరోపించగా ఈ ఆరోపణను చైనా తోసిపుచ్చింది. అది వాతావరణ అధ్యయనం కోసం ప్రయోగించిన బెలూన్ అని స్పష్టం చేసింది. ఈ ఘటన ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారి తీసింది.
ఈ నేపథ్యంలో బెలూన్ వివాదంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా స్పందించారు. బెలూన్ను కూల్చిన ఘటనలో చైనాకు క్షమాపణలు చెప్పే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. త్వరలో తాను చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (Xi Jinping) తో మాట్లాడే అవకాశం ఉందని వెల్లడించారు. ‘త్వరలో అధ్యక్షుడు షీ జిన్పింగ్తో నేను మాట్లాడొచ్చు. మేం ప్రచ్ఛన్న యుద్ధాన్ని కోరుకోవట్లేదు. బెలూన్ కూల్చివేత ఘటనపై క్షమాపణలు చెప్పే ఉద్దేశం లేదు. అమెరికా ప్రజల భద్రత, ప్రయోజనాలకే మా తొలి ప్రాధాన్యం’ అని జో బైడెన్ స్పష్టం చేశారు.