78 శాతం నిండిపోయిన ఐసీయూ బెడ్లు
వాషింగ్టన్: ఒమిక్రాన్ వేరియంట్ కేసుల విస్ఫోటంతో అగ్రరాజ్యం అమెరికా ఆరోగ్య వ్యవస్థ కుదేలవున్నది. రోజుకు సగటున 5 లక్షల చొప్పున కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. వరదలా వచ్చిపడుతున్న రోగులతో దవాఖానల అత్యవసర విభాగాలు నిండిపోవడంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీ ఆపత్కాల వైద్యవిభాగం అధిపతి డాక్టర్ జేమ్స్ ఫిలిప్స్ వెల్లడించారు. చిన్నపిల్లలు కూడా ఎక్కువ సంఖ్యలో దవాఖానల్లో చేరాల్సి వస్తున్నది. గురువారం నాటికి ఐసీయూలు 78 శాతం రోగులతో నిండిపోయాయని అమెరికా ఆరోగ్య, మానవ సేవల విభాగం తెలిపింది. గత రెండేండ్లుగా అమెరికాలో కొవిడ్ బారిన పడిన మొత్తం రోగుల సంఖ్య 5.25 కోట్లు, మరణాల సంఖ్య 8 లక్షలు దాటింది.