Hunger in Sri Lanka | మన పొరుగుదేశం శ్రీలంకలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. కిలో చక్కెర రూ.290, కిలో బియ్యం రూ.500, కేవలం 400 గ్రాముల పాలపొడి రూ.790 పలుకుతున్నది. ఇవి మాత్రమే కాదు లీటర్ పెట్రోల్ ధర రూ.50, లీటర్ డీజిల్ ధర రూ.75 పెరిగింది. 1948లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత శ్రీలంక ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితి ఇది. ఉక్కు పిడికిలి బిగించిన డ్రాగన్ నుంచి తీసుకున్న భారీ రుణాలు శ్రీలంక దివాళా తీయడానికి దారి తీసిన పరిణామాలు.
ఆయిల్, ఆహారం, కాగితం, పప్పులు, ఔషధాలు, వైద్య పరికరాల కోసం పూర్తిగా విదేశాల నుంచి దిగుమతులపైనే శ్రీలంక ఆధారపడింది. రవాణ సంబంధ పరికరాలు కూడా దిగుమతి చేసుకోవాల్సిందే. ప్రజల రోజువారీ నిత్యావసర వస్తువులను దిగుమతి చేసుకోవడానికి శ్రీలంక వద్ద కేవలం 15 రోజులకు సరిపడా డాలర్లు మాత్రమే ఉన్నాయి. మార్చి నాటికి కేవలం 2.36 బిలియన్డాలర్లు మాత్రమే మిగిలాయి. వివిధ విద్యాసంస్థల విద్యార్థులకు పరీక్షల నిర్వహణకు అవసరమైన పేపర్, ఇంక్ కూడా అందుబాటులో లేదు.
డీజిల్, పెట్రోల్, గ్యాస్ పరిస్థితి మరింత తీవ్రంగా పరిణమించింది. రెండు వారాల క్రితం లీటర్ పెట్రోల్ ధర రూ.50, లీటర్ డీజిల్ ధర రూ.75 పెంచేసింది శ్రీలంక సర్కార్. దీంతో లీటర్ పెట్రోల్ ధర 254 శ్రీలంక రూపాయలు, లీటర్ డీజిల్ 176 శ్రీలంక రూపాయలు. పెట్రోల్/ డీజిల్ కొనుగోళ్ల కోసం పెట్రోల్ బంక్ల వద్ద బారులు తీరిన వారిలో పలువురు మరణించారు. ఇప్పటికీ పెట్రోల్ పంపుల వద్ద భారీ క్యూలైన్లలో వేల మంది ప్రజలు ఇంధనం కోసం వేచి చూస్తున్నారు. పరిస్థితి విషమించకుండా పెట్రోల్ బంకుల వద్ద సైన్యాన్ని మోహరించింది గొటాబయ్యా సర్కార్.
మనదేశంలో దాదాపు మారుమూల పల్లెలకూ ఎల్పీజీ గ్యాస్ అంటే వంట గ్యాస్ అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ శ్రీలంకలో 20 శాతం కుటుంబాలు కిరోసిన్ స్టవ్లపైనే వంట చేసుకోవాల్సిన దుస్థితి. భారత్లో పెట్రోల్, డీజిల్ మాదిరిగా శ్రీలంకలో బంకుల ద్వారా కిరోసిన్ పంపిణీ చేస్తుంటారు. పరిస్థితి దారుణంగా విషమించడానికి మరో కారణం కూడా ఉంది.ముడి చమురు నిల్వల కొరతతో దేశంలో ఉన్న ఏకైక ఆయిల్ రిఫైనరీ ప్లాంట్ను సర్కార్ మూసేసింది.
ముడి చమురు, సహజ వాయువు కొరత లంకేయుల పరిస్థితి పేనం మీద నుంచి పొయ్యిలో పడేలా చేసిందన్న విమర్శలు ఉన్నాయి. 12.5 కిలోల వంట గ్యాస్ ధర రూ.1359 పెంచేశారు. దీంతో ఆ వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.4119 పలుకుతున్నది. ఆహార పదార్థాల ధరలు కూడా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయి.. ఆహార ద్రవ్యోల్బణం 25.7 శాతం పెరిగింది. పాలు, బ్రెడ్ వంటి ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు ధరలు ఆగేది లేదంటూ పైపైకి దూసుకెళ్తున్నాయి. కిలో చక్కెర ధర రూ.290 పలికితే, 400 గ్రాముల పాల పొడి రూ.790లకు లభిస్తున్నది. దీంతో కప్ టీ సేవించాలంటే రూ.100 చెల్లించాల్సిందే మరి.