Human Brain | న్యూయార్క్, మార్చి 27: మనిషి మెదడు పరిమాణం పెరుగుతున్నదని అమెరికాకు చెందిన పరిశోధకులు చేసిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. కాలిఫోర్నియా యూనివర్సిటీలోని డెవిస్ హెల్త్కు చెందిన పరిశోధకులు మానవ మెదడుపై చేసిన అధ్యయనం వివరాలు జామా న్యూరాలజీ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనం ప్రకారం.. 1930లలో పుట్టిన వారితో పోలిస్తే 1970లలో పుట్టిన వారి మెదడు సైజు 6.6 శాతం ఎక్కువ ఉన్నట్టు తేలింది.
1999 నుంచి 2019 మధ్యకాలంలో 3,226 మంది మెదడును ఎంఆర్ఐ తీసి అధ్యయనం చేయగా.. 1930లలో జన్మించిన వారి మెదడు సగటున 1,234 మిల్లీలీటర్లు ఉండగా, 1970లలో పుట్టిన వారి మెదడు 1,321 మిల్లీలీటర్లు ఉన్నట్టు గుర్తించారు. మెదడు నిర్మాణంలో భాగమైన వైట్ మ్యాటర్, గ్రే మ్యాటర్, హిప్పోక్యాంపస్ సైజు కూడా పెరిగినట్టు తేల్చారు. కాగా, ఇలా మెదడు సైజు పెరగడం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకులు చెప్తున్నారు. ముఖ్యంగా వయసు పెరిగే వారిలో మతిమరుపు, చిత్తవైకల్యం ముప్పు తగ్గుతుందని తెలిపారు. ఇదే సమయంలో మెదడు సైజు పెరగడం వల్ల మెదడు బాగా అభివృద్ధి చెందుతుందని, మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెప్పారు.