Rishi Sunak | చైనా ప్రయోగిస్తున్న స్పై బెలూన్లు ప్రపంచ దేశాలను కలవరానికి గురి చేస్తున్నాయి. ఇటీవలే అమెరికా గగనతలంలో చైనాకు చెందిన ఓ నిఘా బెలూన్ కనిపించిన విషయం తెలిసిందే. దాన్ని అధ్యక్షుడు బైడెన్ ఆదేశాల మేరకు కూల్చేశారు. అనంతరం మరో మూడు సార్లు అమెరికా గగనతలంలో అనుమానాస్పద వస్తువులు కనిపించగా.. వాటిని కూడా యుద్ధ విమానాల సాయంతో అగ్రారాజ్యం పేల్చేసింది. కాగా, భారత్, బ్రిటన్, కెనెడా సహా 40 దేశాలపై నిఘా పెట్టేందుకు చైనా బెలూన్లను ప్రయోగిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై తాజాగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ స్పందించారు. తమ దేశ రక్షణకై ఏం చేయడానికైనా వెనుకాడబోమని స్పష్టం చేశారు.
‘దేశాన్ని భద్రంగా రక్షించుకునేందుకు ఎటువంటి చర్యలకైనా వెనుకాడబోము. మా గగనతలంలో అనుమానాస్పద వస్తువులను యుద్ధ విమానాలతో కూల్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. మా దేశ గగనతలాన్ని కాపాడుకునేందుకు టైఫూన్ యుద్ధ విమానాలను అప్రమత్తంగా ఉంచాం. అట్లాంటిక్ మిత్ర దేశాలతో నిత్యం టచ్లో ఉంటూ.. రక్షణపరంగా నన్నద్ధతతో ఉన్నాం’ అని రిషి సునాక్ వెల్లడించారు.
కాగా, రెండు రోజుల క్రితం కెనడా గగనతలంపై చక్కర్లు కొడుతున్న అనుమానాస్పద వస్తువును అమెరికా ఫైటర్ జెట్ కూల్చివేసిన విషయం తెలిసిందే. కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో ఆదేశాల మేరకు అమెరికా, కెనెడియన్ వాయుసేనలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో యూకాన్ వద్ద అమెరికన్ యుద్ధవిమానం ఎఫ్-22 దానిని పేల్చివేసింది. అనుమానాస్పద వస్తువు శిథిలాలు యూకాన్లో పడ్డాయని.. వాటిని పరిశీలించనున్నామని ట్రుడో ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గత శుక్రవారం (అమెరికా కాలమానం ప్రకారం) అమెరికాలోని అలస్కా వద్ద 40 వేల ఫీట్ల ఎత్తులో చక్కర్లు కొడుతున్న ఓ గుర్తు తెలియని వస్తువును ఆ దేశ యుద్ధ విమానాలు పేల్చేసిన విషయం తెలిసిందే. వారం రోజుల క్రితమే చైనాకు చెందిన నిఘా బెలూన్ను కూడా అమెరికా విమానాలు కూల్చేశాయి.