Israel-Hamas War | జెరూసలేం, అక్టోబర్ 13: ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధంలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకొన్నది. హమాస్ మిలిటెంట్ గ్రూపును సమూలంగా మట్టుపెట్టే ప్లాన్లో భాగంగా ఇజ్రాయెల్ ‘గ్రౌండ్ ఆపరేషన్’ ప్రారంభించినట్టు తెలుస్తున్నది. గాజా భూభాగంలోకి తమ బలగాలు, యుద్ధ ట్యాంకులు ప్రవేశించినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) శుక్రవారం ప్రకటించింది. ఉగ్రవాదులను మట్టుపెట్టడంతోపాటు ఇజ్రాయెల్ నుంచి బందీలుగా తీసుకెళ్లిన వారి ఆచూకీ కోసం గత 24 గంటలుగా ‘స్థానిక ఆపరేషన్’ ప్రారంభించినట్టు తెలిపింది. పలు టెర్రరిస్టులను తమ బలగాలు విజయవంతంగా హతమార్చాయని, బందీల ఆచూకీకి సంబంధించి సమాచారం సేకరించాయని పేర్కొన్నది. అయితే ఇజ్రాయెల్ బలగాలు గాజా భూభాగం పూర్తి లోపలికి ఇంకా వెళ్లలేదని ‘చానెల్ 12’ నివేదించింది.
మరోవైపు హమాస్ మిలిటెంట్లను పూర్తిగా ఏరివేసే ప్రక్రియ చేపట్టేందుకు ఇజ్రాయెల్ సైన్యం మరో కీలక నిర్ణయం తీసుకొన్నది. ఉత్తర గాజా రీజియన్లో ఉంటున్న దాదాపు 11 లక్షల మంది పాలస్తీనియన్ పౌరులు 24 గంటల్లో వెంటనే ఆ ప్రాంతాన్ని వీడి, దక్షిణ గాజాలోకి వెళ్లిపోవాలని శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. గాజా సిటీకి కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయి. ఉత్తర గాజాలో అక్కడ పౌరుల మధ్య ఉంటూ కార్యకలాపాలను నడుపుతున్న హమాస్ మిలిటెంట్లను ఒక్కొక్కరిగా అంతమొందించే చర్యలో భాగంగా ఈ ఆదేశాలు వెలువడినట్టు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఒక్కసారిగా ఇంత పెద్ద సంఖ్యలో జనాభాను వారు ఉంటున్న ప్రాంతాన్ని వీడాలని ఆదేశాలు ఇవ్వడంపై ఐక్యరాజ్యసమితి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పరిణామాలు మానవతా సంక్షోభాన్ని సృష్టిస్తాయని అభిప్రాయపడింది. ఇజ్రాయెల్ అటువంటి ఆదేశాలను వెనక్కు తీసుకోవాలని ఐరాస అధికార ప్రతినిధి స్టెఫాన్ డుజారిన్ అన్నారు.
గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దాడులు వెంటనే ఆపకుంటే, ఈ యుద్ధం మధ్య ప్రాచ్యంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తుందని ఇరాన్ హెచ్చరించింది. మరోవైపు, ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన ఒక డేరింగ్ ఆపరేషన్కు సంబంధించిన వీడియోను ఐడీఎఫ్ శుక్రవారం విడుదల చేసింది. గాజా సరిహద్దు సమీపంలో చేపట్టిన ఆపరేషన్లో సైనికులు అత్యంత ధైర్యసాహసాలతో హమాస్ చెర నుంచి 250 మంది బందీలను కాపాడారు.
యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ అజయ్లో భాగంగా ఇజ్రాయెల్ నుంచి విద్యార్థులు సహా దాదాపు 200 మంది భారతీయులతో కూడిన తొలి విమానం శుక్రవారం ఉదయం ఢిల్లీ చేరింది. బాంబు దాడులు, సైరన్ల హెచ్చరికలతో భయానక పరిస్థితులు నెలకొన్నాయని, ఈ యుద్ధం ఎంత వరకు వెళ్తుందో తెలియడం లేదని మొదటి బ్యాచ్లో భాగంగా ఇజ్రాయెల్ నుంచి వచ్చిన శశ్వాత్ సింగ్ పేర్కొన్నారు.