న్యూఢిల్లీ : చైనాలో కొవిడ్-19 విజృంభణ కొనసాగుతుండటంతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. షాంగ్జి, హెబీ, హునాన్, జియాంగ్సు సహా పలు ప్రావిన్స్ల్లో ఆస్పత్రుల సిబ్బంది అహోరాత్రులు శ్రమిస్తున్నా రోగుల తాకిడి అంతకంతకూ పెరుగుతూనే ఉంది.
న్యూ ఇయర్ హాలిడేస్లో కేసుల్లో పెరుగుదల కనిపిస్తుండటంతో రోగుల అవసరాలను తీర్చేందుకు సెలవలను రద్దు చేసుకోవాలని సిబ్బందిని అధికారులు కోరుతున్నారు. మరోవైపు వైరస్ వ్యాప్తి నేపధ్యంలో పరీక్షలను ముమ్మరంగా నిర్వహించాలని, వైరల్ సీక్వెన్సింగ్ను బలోపేతం చేయాలని, చికిత్సా విధానాన్ని సమర్ధంగా చేపట్టాలని చైనాను డబ్ల్యూహెచ్ఓ కోరింది.
బీఎఫ్ 7 వంటి నూతన వేరియంట్ల పుట్టుకను ట్రాక్ చేసేందుకు వైరల్ సీక్వెన్సింగ్ తప్పనిసరి. చైనా నుంచి వచ్చే ప్రయాణీకులందరికీ పరీక్షలను తప్పనిసరి చేస్తూ 12 దేశాలు ట్రావెల్ నియంత్రణలను అమలు చేస్తున్నాయి. కొవిడ్-19 నెగెటివ్ సర్టిఫికెట్ ఉన్నవారినే తమ దేశాల్లోకి అనుమతిస్తున్నాయి.