King Charles | న్యూఢిల్లీ/లండన్, మే 5: బ్రిటన్ రాజుగా చార్లెస్ 3 పట్టాభిషేకానికి సర్వం సిద్ధమైంది. శనివారం లండన్లోని చారిత్రక వెస్ట్మిన్స్టర్ అబేలో ఈ వేడుక అట్టహాసంగా జరగనుంది. 1953లో క్వీన్ ఎలిజబేత్ పట్టాభిషేకం జరిగిన ఏడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు చార్లెస్ 3 పట్టాభిషేకం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి వివిధ దేశాధినేతలకు, పలు రంగాల ప్రముఖులకు ఆహ్వానం అందింది. మొత్తం 2000 మంది అతిథుల సమక్షంలో పట్టాభిషేక మహోత్సవం జరగనున్నది. భారత్ తరఫున ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్ ఈ వేడుకకు హాజరుకానున్నారు.
కింగ్ చార్లెస్ 3 పట్టాభిషేకం క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరగనున్నా వివిధ మత సంప్రదాయాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. హిందూ విశ్వాసానికి ప్రతినిధిగా నరేంద్ర బాబుభాయ్ పటేల్ కింగ్ చార్లెస్కు సార్వభౌమ ఉంగరాన్ని అందించనున్నారు. సిక్కు వర్గానికి చెందిన ఇంద్రజిత్ సింగ్ పట్టాభిషేక గ్లవ్ను అందిస్తారు. ముస్లింల ప్రతినిధిగా సయ్యద్ కమల్ బ్రాస్లేట్ జోడీని అందించనున్నారు. కాగా, ఈ కార్యక్రమానికి హిందువైన బ్రిటన్ ప్రధాని రిషి సునక్ హాజరుకానున్నారు. సంప్రదాయం ప్రకారం ఆయన కూడా మిగతా అతిథులతో కలిసి ఈ వేడుకలో బైబిల్ చదవనున్నారు.