Bangladesh : మైనారిటీలపై దాడులతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ లో మరో హిందువు ప్రాణాలు కోల్పోయాడు. అవామీ లీగ్ అనే హిందూ సంస్థకు చెందిన హిందూ నాయకుడు, సంగీత కారుడు అయిన ప్రొలోయ్ చాకి (60) ఆదివారం సాయంత్రం పోలీసు కస్టడీలో కన్నుమూశాడు. ప్రొలోయ్.. షేక్ హసీనా ప్రభుత్వంలో కల్చరల్ ఎఫైర్స్ విభాగంలో సెక్రటరీగా పని చేశాడు. పబ్నా ప్రాంతం, పతర్తాలాలోని తన నివాసం నుంచి గత డిసెంబర్ 16న ప్రొలోయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
2024లో జరిగిన ఒక బాంబు పేలుడు కేసుకు సంబంధించి అతడిని అరెస్టు చేశారు. అక్కడి పోలీసుల కథనం ప్రకారం.. ప్రొలోయ్ కు మధుమేహం సహా అనేక ఆరోగ్య సమస్యలున్నాయి. ఈ క్రమంలో జైలులో ఉన్న అతడు శుక్రవారం తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో మొదట స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం రాజ్ షాహి మెడికల్ హాస్పిటల్ కు తీసుకెళ్తుండగా.. ఆదివారం రాత్రి ప్రొలోయ్ మరణించాడు. కాగా.. ప్రొలోయ్ మరణంపై అతడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే అతడు మరణించినట్లు చెప్పారు. తన తండ్రికి గుండె సమస్య ఉందని, అయినప్పటికీ తగిన చికిత్స అందించడంలో పోలీసులు విఫలమయ్యారని అతడి కొడుకు సని చాకి ఆరోపించారు.
తన తండ్రి ఆరోగ్య స్తితిపై పోలీసులు తమకు కనీసం సమాచారం ఇవ్వలేదని చెప్పారు. అయితే, వారి ఆరోపణలను పోలీసులు ఖండించారు. తాము నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని, తమ సేవల్లో ఎలాంటి లోపం లేదని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఇప్పటివరకు స్పష్టమైన విచారణ ఏదీ జరగలేదు. దీనిపై అక్కడి మానవ హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసు కస్టడీలో మరణించిన వారిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి.