ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నది. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పస్తులుండే పరిస్థితి నెలకొన్నది. భారీగా ధరలు పెరిగిపోవడంతో కనీసం రెండు రొట్టెలు తీసేందుకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది. గోధుమల రేటు రూ.50వేలుదాటింది. రావల్పిండి బహిరంగ మార్కెట్లో పిండి రేటు కిలోకు రూ.150 పలుకుతున్నది. పంజాబ్ ప్రావిన్స్లోని షహర్నగరంలో 15 కిలోల గోధుమల బస్తాను రూ.2,250కు విక్రయిస్తున్నారు. అదే సమయంలో, సబ్సిడీపై అందించే పిండి ధరలు సైతం ఆకాశాన్ని అంటుతున్నాయి. సబ్సిడీ 25 కిలోల ప్యాకెట్ పిండి ధర రూ.3100కి చేరింది.
పెరిగిన పిండి ధరల కారణంగా పాక్లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. సింధ్ ప్రావిన్స్లో ఒక వ్యక్తి సబ్సిడీ పిండి ప్యాకెట్ల కోసం జరిగిన గొడవలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సింధ్లోని మీర్పూర్ ఖాస్లో కొందరు వ్యక్తులు వాహనంపై పిండి ప్యాకెట్లను తీసుకువచ్చి, తక్కువ ధరకే పిండి ప్యాకెట్లను ఇస్తున్నట్లు చెప్పడంతో జనం పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఈ క్రమంలో గొడవ జరిగింది. పాకిస్తాన్ ఫ్లోర్ మిల్స్ అసోసియేషన్ (PFMA) ప్రకారం.. గోధుమల కోటా తక్కువగా ఉంది. బహిరంగ మార్కెట్లో గోధుమలు రూ. 5,400 చొప్పున విక్రయిస్తున్నారు. రావల్పిండి బేకర్స్ అసోసియేషన్ ప్రకారం.. ధరలను అదుపులోకి తీసుకురాకపోతే.. పిండి రేట్లు మరో రూ.5 వరకు పెంచనున్నట్లు స్థానిక మీడియా తెలిపింది.
ప్రభుత్వం గోధుమల కోటాను తక్కువ విడుదల చేస్తోందని, దాంతో ధరలు భారీగా పెరుగుతున్నాయని మిల్లర్లు పేర్కొంటున్నారు. దీనికి ఆహార ధాన్యాల కొరత నేపథ్యంలో ధరలు భారీ పెరుగుతున్నాయని మిల్లర్లు తెలిపారు. టన్నుల గోధుమలను రూ.21వేలు నుంచి రూ.22వేలకు పంజాబ్ ఆహారశాఖ కొనుగోలు చేస్తుందని పీఎఫ్ఎంఏ మాజీ ప్రెసిడెంట్ ఖలేక్ అర్షద్ మీడియాతో తెలిపారు. సింధ్, ఖైబర్-పక్తుంఖ్వా, బలూచిస్థాన్లలో ప్రభుత్వం తక్కువగా కోటాను విడుదల చేస్తుందని, ‘మార్కెట్లో డిమాండ్కు సరిపడా ధాన్యం లేదని పేర్కొన్నారు.