గాజా: ఇజ్రాయెల్, హమాస్ మధ్య విడుత బందీల (Hostages) విడుదలలో రెండో రోజు సందిగ్ధత నెలకొంది. గాజాకు మానవతా సాయం అందించడంలో ఆలస్యంపై అసంతృప్తితో ఉన్న హమాస్ (Hamas) తమ వద్ద ఉన్నవారిని విడిచిపెట్టేందుకు కాస్త సంశయించింది. అయితే అనుకున్న సమయానికి బందీలను విడుదల చేయకపోవడంతో గాజాపై (Gaza) తమ సైన్యాలు దాడికి దిగడానికి సద్ధమవుతున్నాయని ఇజ్రాయెల్ (Israel) హెచ్చరికలు జారీచేసింది. దీంతో శనివారం అర్ధరాత్రి తర్వాత 17 మందిని విడుదల చేసింది. ఈజిప్ట్ (Egypt) వైపున్న రఫా సరిహద్దుల్లో (Rafah border) వారిని రెడ్క్రాస్కు (Red Cross) అప్పగించింది. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
తాజాగా విడుదల చేసిన వారిలో 13 మంది ఇజ్రాయెల్ పౌరులు ఉండగా, మరో నలుగురు థాయ్ జాతీయులు. అందులో ఆరుగురు మహిళలు, ఏడుగురు చిన్నారులు, టీనేజర్లు ఉన్నారని అధికారులు చెప్పారు. వారిని ఇజ్రాయెల్లోని దవాఖానల్లో చేర్చినట్లు వెల్లడించారు. కాగా, ఒప్పందంలో భాగంగా తన వద్ద బందీగా ఉన్న 42 మంది ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టనుంది. తొలివిడుతలో 24 మంది బందీలను హమాస్ వదిలేసిన విషయం తెలిసిందే.
ఇజ్రాయెల్-హమాస్ నాలుగు రోజుల కాల్పుల విరమణ ఒప్పందంతో ఇరు పక్షాల మధ్య రెండు నెలలుగా జరుగుతున్న యుద్ధానికి విరామం లభించింది. ఈ సమయంలో బందీలను పరస్పరం మార్చుకోవడంతోపాటు గాజాకు మానవతా సాయం అందించాలని ఓ నిర్ణయానికి వచ్చాయి. ఇందులో భాగంగా హమాస్ 50 మంది బందీలను, ఇజ్రాయెల్ 150 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టాల్సి ఉంది.