Hamas | గాజాలోని హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్, ఇతర దేశాల పౌరులను క్రమక్రమంగా విడుదల చేస్తున్నారు. తాజాగా మరో ఇద్దరు బందీలను హమాస్ విడుదల చేసింది. మానవతా దృక్పథంతో ఇద్దరు మహిళలను విడుదల చేసినట్లు హమాస్ ప్రకటించింది. ఖతార్, ఈజిప్టు మధ్యవర్తిత్వంతోనే మహిళలను విడిచిపెట్టామని హమాస్ తన ప్రకటనలో వెల్లడించింది.
విడుదలైన ఇద్దరు మహిళలు అమెరికాకు చెందిన జుడిత్ టై రానన్, ఆమె కూతురు నటలై సోషనా రానన్. కాగా వీరిద్దరిని గాజా, ఈజిప్టు మధ్య ఉన్న రాఫా సరిహద్దు వద్ద వదిలిపెట్టారు. బందీలుగా ఉన్న మరో 50 మందిని హమాస్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక గడిచిన 24 గంటల్లో 300కు పైగా కొత్త దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ మిలటరీ పేర్కొంది. ఈ దాడులతో మొత్తం మరణాల సంఖ్య 5 వేలకు పైగా చేరుకుందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మృతుల్లో 2 వేల మంది చిన్నారులు ఉన్నట్లు పేర్కొంది.
హమాస్ మిలిటెంట్ల వద్ద 222 మంది బందీలుగా ఉన్నట్ల ఐడీఎఫ్ అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే, ఇదే తుది సంఖ్య కాదని అన్నారు. కనిపించకుండా పోయిన వారి కోసం మిలిటరీ దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. హమాస్ దాడి తర్వాత 13 కుటుంబాలకు చెందిన 21 మంది చిన్నారులు అనాథలుగా మారారని ఇజ్రాయెల్ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.