న్యూఢిల్లీ : యుద్ధంతో అతలాకుతలమైన గాజాలో తన 20 ఏండ్ల పాలనకు ముగింపు పలుకుతూ హమాస్ సోమవారం తన అత్యవసర పాలక మండలిని రద్దు చేసింది. 2007లో గాజాలో హమాస్ పాలన మొదలైంది. హమాస్ తాజా చర్యతో గాజా ప్రాంతంలో పౌర పాలనను అమలు చేయడానికి ఏర్పాటైన గాజా జాతీయ పరిపాలనా కమిటీ(ఎన్సీఏజీ)కి మార్గం సుగమం చేస్తున్నది. ఎన్సీఏపీ పర్యవేక్షణ బాధ్యతను బోర్డ్ ఆఫ్ పీస్(బీవోపీ) నిర్వహిస్తుంది. ఇది అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వంలోని ఒక అంతర్జాతీయ కూటమి.
గాజాలో రోజువారీ పరిపాలన నుంచి తాము వైదొలగడానికి సిద్ధంగా ఉన్నట్లు తీవ్రవాద గ్రూపు హమాస్ ఇదివరకే ప్రకటించింది. నిరాయుధీకరణ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. జాతీయ కమిటీ తన బాధ్యతలను స్వీకరించే వరకు ఆ కమిటీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు జాతీయ స్థాయిలో ఆమోదయోగ్యమైన వ్యక్తిని నియమించాలని హమాస్ నిర్ణయించినట్లు ఆ గ్రూపు ప్రతినిధిని ఉటంకిస్తూ ఏఎఫ్పీ వార్తా సంస్థ తెలిపింది.