గాజా: ఇజ్రాయెల్-హమాస్ మధ్య (Israel-Hamas War) దాదాపు రెండు నెలలుగా జరుగుతున్న యుద్ధానికి తాత్కాలిక విరామం లభించింది. ఖతార్ మధ్యవర్తిత్వంతో నాలుగు రోజులపాటు కాల్పుల విరమణ (Ceasefire) పాటించాలని ఇరుపక్షాలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ సమయంలో బందీల మార్పిడి (Hostages Exchange) , మానవతా సాయం అందించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం బందీల విడుదల ప్రారంభమైంది. తొలివిడుతలో భాగంగా తమవద్ద ఉన్న 24 మందిని హమాస్ వదిలేయగా, 39 మంది పాలస్తీనా ఖైదీలను (Palestinian hostages) ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. నేడు రెండో విడుతగా మరికొందరికి విముక్తి లభించనుంది.
ఈనేపథ్యంలో తాము విడుదల చేయనున్నవారి జాబితాను ఇజ్రాయెల్ ప్రభుత్వానికి హమాస్ అందించింది. ప్రస్తుతం దానిపై ప్రధాని బెంజమెన్ నెతన్యాహూతోపాటు (Benjamin Netanyahu) అధికారులు సమీక్షిస్తున్నారని ఇజ్రాయెల్ వర్గాలు వెల్లడించాయి. తాము ఎవరెవరిని విడుదల చేయాలని అంశమై చర్చిస్తున్నామని తెలిపారు. గత నెల 7న ఇజ్రాయెల్ సరిహద్దు గ్రామాలపై దాడిచేసిన హమాస్ 240 మందిని బందీలుగా తమతో తీసుకెళ్లిన విషయం తెలిసిందే. కాగా, ఒప్పందంలో భాగంగా హమాస్ 50 మంది బందీలను, ఇజ్రాయెల్ 150 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టాల్సి ఉంది.
నాలుగు రోజుల కాల్పుల విరమణ నేపథ్యంలో మానవతా సాయం కూడా గాజా స్ట్రిప్లోకి ప్రవేశించడం ప్రారంభమైంది. కాల్పుల విరమణ ప్రారంభమైన వెంటనే నాలుగు ఇంధన ట్యాంకర్లు, వంట గ్యాస్తో మరో నాలుగు ట్యాంకర్లు ఈజిప్టు నుంచి గాజాకి వచ్చాయని పాలస్తీనా రెడ్ క్రెసెంట్ సొసైటీ తెలిపింది. ఆహారం, నీళ్లు, ఔషధాలు వంటి అత్యవసర సామాగ్రితో కూడిన ట్యాంకర్లలో రోజుకు 196 ట్రక్కుల చొప్పున ఈ నాలుగు రోజుల్లో గాజా, వెస్ట్ బ్యాంకుకు రవాణా కానుందని వెల్లడించింది. యుద్ధం ఆరంభమైనప్పటి నుంచి గాజాకు చేరుతున్న అతిపెద్ద సాయం ఇదేనని పేర్కొంది.