ఆరుగురు మృతి.. 28 మందికి గాయాలు
మాస్కో, సెప్టెంబర్ 20: రష్యాలోని పెర్మ్ స్టేట్ యూనివర్సిటీలో సోమవారం ఉదయం కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, 28మంది వరకూ గాయపడ్డారు. రబ్బర్ బుల్లెట్ గన్ను ఆధునికీకరించిన దుండగుడు.. యూనివర్సిటీలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడని అధికారులు తెలిపారు. ప్రాణాలు రక్షించుకునే క్రమంలో కొందరు విద్యార్థులు కిటికీల నుంచి బయటకు దూకినట్టు వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే, అతడు ఎవరన్న విషయాన్ని, కాల్పులకు గల కారణాలను ఇంకా వెల్లడించలేదు. కాగా, వర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థులందరూ క్షేమంగా ఉన్నారని రష్యాలోని భారత ఎంబసీ వెల్లడించింది. గత మేలో రష్యాలోని ఓ పాఠశాలలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఏడుగురు చిన్నారులు, ఇద్దరు టీచర్లు మరణించారు.