వాషింగ్టన్, జనవరి 31: మనిషి జన్యు నిర్మాణాన్ని ఆసాంతం చదివి, అందులో లోపాల్ని పసిగట్టే ‘ఏఐ (కృత్రిమ మేధ) టెక్నాలజీ’ని గూగుల్ డీప్మైండ్ తయారుచేసింది. కొత్తగా అభివృద్ధి చేసిన ఈ సాంకేతికత మానవ డీఎన్ఏలోని పెద్ద పెద్ద భాగాలన్నీ చదవగలదు. అంతేగాక దానిని విశ్లేషించి జన్యు ఉత్పరివర్తనాలు, జన్యు నియంత్రణను కూడా అంచనా వేయగలదు. వ్యాధికి కారణమయ్యే జన్యు మార్పులను గుర్తించటంలో, కొత్త చికిత్సలను కనుగొనటంలో సైంటిస్టులకు ‘ఆల్ఫాజినోమ్’ అత్యంత సహాయకారిగా మారనున్నది. ఈ ఏఐ టెక్నాలజీ డీఎన్ఏ కోడ్లో 10 లక్షల అక్షరాల వరకు విశ్లేషిస్తుంది.
మానవులు, ఎలుకల జెనెటిక్ డాటాను చదవగలిగే విధంగా ఈ ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. వివిధ అవయవయాల్లో జీవ సంబంధమైన మార్పులను వైద్యులు కనుగొనేందుకు దీని వల్ల అవకాశం ఏర్పడుతుందని తెలిసింది. మొత్తం జీవితాన్ని నియంత్రిస్తున్న ‘బయలాజికల్ కోడ్’పై పరిశోధనను వేగవంతం చేస్తుందని ‘డీప్మైండ్’ సైంటిస్ట్ నటాషా లాటిషేవా అన్నారు. జన్యుపరమైన చికిత్సల అభివృద్ధికి ఈ టెక్నాలజీ ఎంతగానో దోహదపడుతుందన్నారు. గుండె జబ్బులు, రోగ నిరోధకత లేకపోవటం, మానసిక రుగ్మతలు, పలు రకాల క్యాన్సర్లు..ఇవన్నీ జన్యు మార్పులతో ముడిపడి ఉన్నాయి. ఇక్కడే ‘ఆల్ఫాజినోమ్’ వైద్యులకు సహాయకారిగా మారనున్నది.