న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత అంతకంతకూ పెరుగుతున్నదని, గతంతో పోలిస్తే వైరస్ వేగంగా వ్యాపిస్తున్నదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వచ్చే నాలుగు వారాలు అత్యంత కీలక సమయమని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ నిబంధనలు పాటించాలని హెచ్చరించింది. ఈ మేరకు మంగళవారం నీతిఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో రెండో దశ కరోనా ఉద్ధృతిని (సెకండ్ వేవ్ను) అరికట్టడంలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని తెలిపారు. దేశంలో అన్ని వయసుల వారికి వ్యాక్సిన్ వేయాలన్న డిమాండ్లపై పాల్ స్పందించారు. వైరస్ ప్రమాదం ఎక్కువగా ఉన్నవారికే తొలుత టీకాను ఇస్తామన్నారు. వ్యాక్సిన్ వేసుకోవాలనుకుంటున్నవారికంటే, టీకా అవసరమైన వారికే తమ ప్రాధాన్యత ఉంటుందన్నారు. మరోవైపు సోమవారం నుంచి మంగళవారానికి 24 గంటల్లో దేశంలో కొత్తగా 96,982 కేసులు నమోదయ్యాయి. 446 మంది మరణించారు. సోమవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 43 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. దీంతో టీకా తీసుకున్నవారి సంఖ్య 8,31,10,926కు చేరింది.
దేశ జనాభాను బట్టి చూస్తే మనదగ్గరే తక్కువ కేసులు, మరణాలు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషన్ తెలిపారు. మహారాష్ట్రలోని ఏడు జిల్లాలు, ఢిల్లీ, కర్ణాటక, ఛత్తీస్గఢ్లలో ఒక్కో జిల్లాలో యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ కేజ్రీవాల్ ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 30 వరకు రోజూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. కర్ఫ్యూ కొనసాగే సమయాల్లో వ్యాక్సినేషన్ కోసం వెళ్లే వారు ఈ-పాస్ను వెంట తీసుకువెళ్లాలని సూచించారు. రాత్రి సమయాల్లో ఎయిర్పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లకు వెళ్లే గర్బిణిలు, రోగులు సంబంధిత టికెట్లను తీసుకువెళ్లాలన్నారు. మరోవైపు, చండీగఢ్లో కూడా రాత్రి కర్ఫ్యూ విధించారు.
మహారాష్ట్రలోని పుణెలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. రోగుల చికిత్సకు సరిపడా బెడ్లు లేకపోవడంతో యశ్వంత్రావ్ చవాన్ మెమోరియల్ దవాఖానలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. దవాఖాన ఆవరణలో టెంట్లు వేసి కొవిడ్ రోగులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దవాఖానలో 400 పడకలు ఉండగా, రోగులతో అన్నీ నిండిపోయాయని, కొత్తగా వచ్చే రోగులను వెనక్కి పంపించడం ఇష్టంలేక టెంటు కింద ఆక్సిజన్ చికిత్స ఏర్పాటు చేశామని ఓ వైద్యుడు తెలిపారు.
వారాంతాల్లో బీచ్లు, గార్డెన్లు, మైదానాలను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్న ముంబై అధికారులు వారంలోని మిగతా రోజుల్లో కూడా కఠిన ఆంక్షలను విధించారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు బీచ్లు, గార్డెన్లు, మైదానాలను మూసివేస్తున్నట్టు పేర్కొన్నారు. అత్యవసర వస్తువులు మినహా ఇతర వస్తువులను విక్రయించే దుకాణాలను ఈ నెల 30 వరకు మూసివేయాలన్న మహారాష్ట్ర సర్కార్ ఆదేశాలపై నాగ్పూర్లోని వర్తక సంఘాలు మంగళవారం నిరసనలు చేపట్టాయి.
ఒడిశాలో కూడా కరోనా తీవ్రత పెరుగుతుండటంతో.. కరోనా లేదని తెలిపే ‘కొవిడ్-19 నెగటివ్’ ధ్రువపత్రం ఉన్నవారినే పూరి జగన్నాథ్ ఆలయంలోకి అనుమతిస్తామని పూరి జిల్లా అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మధ్యవర్తులను ప్రకటిస్తే జవాన్ను అప్పగిస్తాం
బీజేపీ ఎంపీని ఘెరావ్ చేసిన రైతులు
పంజాబ్ నుంచి యూపీకి గ్యాంగ్స్టర్ తరలింపు
మీలాగే.. మేం హిందువులకు పిలుపునిస్తే..
పోలింగ్ ప్రశాంతం.. తీర్పు నిక్షిప్తం
సర్వోన్నత న్యాయపీఠంపై తెలుగు తేజం