కైరో: ఆఫ్రికా దేశమైన సూడాన్ (sudan)లో ఘోర ప్రమాదం జరిగింది. దేశంలో ఓ బంగారు గని (Gold mine) కూలడంతో 38 మంది దుర్మరణం చెందారు. మరికొందరు గాయపడ్డారని ప్రభుత్వ మైనింగ్ కంపెనీ తెలిపింది. దేశరాజధాని ఖార్టోమ్కు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫూజా గ్రామంలో ఉన్న దర్సాయా బంగారు గనిలో ఈ ఘటన జరిగింది.
బంగారు గనిలో ప్రస్తుతం ఎలాంటి తవ్వకాలు జరగడం లేదని, 2019లోనే దానిని మూసివేశామని ప్రభుత్వ మైనింగ్ కంపెనీ వెల్లడించింది. అయితే సరైన భద్రత లేకపోవడంతో స్థానికులు తరచూ ఆ గనిలోకి వెళ్తుంటారని, ఈ నేపథ్యంలోనే ప్రమాదం జరిగిందని తెలిపింది. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారని స్థానిక మీడియా పేర్కొన్నది.
ఆఫ్రికా ఖండంలో బంగారం ప్రధాన ఉత్పత్తిదారుగా సూడాన్ ఉన్నది. గతేడాది ఈ దేశం 36.6 టన్నుల బంగారాన్ని వెలికితీసింది. కాగా, ప్రభుత్వం సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో బంగారు గనుల్లో ప్రమాదాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి.