న్యూఢిల్లీ : ఉక్రెయిన్తో యుద్ధంతో నేపథ్యంలో రష్యాపై పలు దేశాలు ఆంక్షల బాటపడుతున్నాయి. సైనిక చర్యను నిరసిస్తూ రష్యాకు చెందిన విమానాలకు గగనతలాన్ని మూసివేస్తున్నట్లు జర్మనీ, బెల్జియం ప్రకటించాయి. రష్యన్ విమానాల కోసం జర్మన్ గగనతలాన్ని మూసివేయడాన్ని జర్మనీ ఫెడరల్ మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రవాణా మంత్రి వోల్కర్ విస్సింగ్ సమర్థించారు. అలాగే జర్మన్ ఎయిర్లైన్స్ లుఫ్తాన్స రష్యాకు వెళ్లే విమానాలను రద్దు చేసింది. ప్రస్తుతం రష్యన్ గగనతలంలో ఉన్న విమానాలు త్వరలోనే మళ్లీ బయలుదేరాయని పేర్కొంది. బెల్జియం సైతం రష్యన్ విమానాలు తమ గగనతలాన్ని ఉపయోగిచుకోకుండా నిషేధం విధించింది. ఎయిర్స్పేస్ను మూసివేస్తున్నట్లు వెల్లడించింది. ఉక్రెయిన్పై క్షిపణులు, బాంబులతో రష్యా విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఆంక్షల పర్వం కొనసాగుతోంది.