Hamas-Israel conflict | హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం ఇంకా కొనసాగుతున్నది. రెండునెలలుపైగా సాగుతున్న ఈ యుద్ధం ఇప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. అయితే, గాజాలో పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ నిర్వహిస్తున్న తనిఖీలతో యుద్ధంలో గాయపడ్డ రోగికి సకాలంలో చికిత్స అందకపోవడంతో మృతి చెందాడని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ఆరోపించారు. ఆరోగ్య కార్యకర్తలను నిర్బంధించడంతో పాటు సహాయక ట్రక్కులపై దాడి చేస్తూ గాజాలో ఆరోగ్య, రెస్క్యూ మిషన్లకు ఇజ్రాయెల్ అంతరాయం కలిగించిందన్నారు. వీటితో ఆ రోగిని మృతి చెందాడన్నారు. అల్-అహ్లీ హాస్పిటల్ నుంచి శనివారం గాజాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మిషన్కు తమకు సమాచారం వచ్చిందని, ఆరోగ్య కార్యకర్తలు చాలాకాలం పాటు నిర్బంధించడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఇలాంటి చర్యలు రోగుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తాయన్నారు. పాలస్తీనా రెడ్ క్రెసెంట్ సొసైటీకి చెందిన కొందరు ఉద్యోగులను ఉత్తర గాజాకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో కూడా అదుపులోకి తీసుకున్నారని ఆయన ఆరోపించారు. వైద్య సామగ్రి, అంబులెన్స్తో కూడిన సహాయక ట్రక్పై కాల్పులు జరిగినట్లు చెప్పారు. రోగులను, రెడ్ క్రెసెంట్ ఉద్యోగులను అంబులెన్స్ నుంచి బయటకు రప్పించి చాలా గంటల పాటు విచారించారన్నారు. చాలా గంటలు విచారించడంతో మార్గమధ్యంలో ఓ పేషెంట్ చనిపోయాడన్నారు. ఇదిలా ఉండగా.. అక్టోబర్ 7న మొదలైన యుద్ధంలో ఆరువేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ సైన్యం గాజాపై విరుచుకుపడుతున్నది. ఇప్పటి వరకు గాజా స్ట్రిప్లో 5వేల మంది, ఇజ్రాయెల్లో 1400 మంది ప్రాణాలు కోల్పోయారు.