కార్బిస్ బే: వచ్చే ఏడాదిలోపు ప్రపంచానికి వంద కోట్ల కరోనా వ్యాక్సిన్లు ఇవ్వడానికి జీ7 దేశాలు అంగీకరించినట్లు సమాచారం. ప్రైవేట్ సెక్టార్, జీ20, ఇతర దేశాలతో కలిసి వ్యాక్సిన్లపై తమ సహకారాన్ని అందజేయాలని ఏడు దేశాల అధినేతలు నిర్ణయించారు. ఇందుకు సంబంధిన అధికారిక ప్రకటన ముసాయిదా కూడా సిద్ధమైంది. ఈ ప్రకటనలో చాలా వరకూ అన్ని దేశాల దౌత్యవేత్తలు అంగీకరించారు. ఏవో కొన్నింట్లో మాత్రమే స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు రాయ్టర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. చైనాపై కఠిన వైఖరి అవలంభించాలని జపాన్ పట్టుబడుతోంది.
ప్రపంచానికి డొనేట్ చేయబోయే 100 కోట్ల వ్యాక్సిన్లలో 70 కోట్లను ఈ ఏడాది చివరిలోపే ఎగుమతి చేయాలని జీ7 దేశాలు భావిస్తున్నాయి. వీటిలో 50 శాతం వ్యాక్సిన్లు ఈ జీ7 కూటమిలో లేని దేశాలకే వెళ్తాయని ఈ ప్రకటన చెబుతోంది. డబ్ల్యూహెచ్వో, గ్లోబల్ అలయెన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యూనైజేషన్.. పేద దేశాలకు 200 కోట్ల వ్యాక్సిన్లను ఇవ్వాలని చూస్తోంది. అందులో జీ7 దేశాల వాటానే 100 కోట్లుగా ఉండనుంది. వీటిలోనూ అమెరికా 50 కోట్ల వ్యాక్సిన్లు ఇస్తామని చెప్పింది.