Foxconn | చైనాలోని యాపిల్కు చెందిన ఐఫోన్ తయారీ కేంద్రం ఫాక్స్కాన్లో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. జీరో కోవిడ్ పాలసీ పేరిట పెట్టిన ఆంక్షలకు విసుగెత్తిన ఉద్యోగులు బుధవారం ఉదయం ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. యాజమాన్యం వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఫాక్స్కాన్ తాజాగా స్పందించింది. ఈ మేరకు ఉద్యోగులకు క్షమాపణలు చెప్పింది. ‘ఈ ఘటనపై మా బృందం విచారణ జరుపుతోంది. కొత్త సిబ్బంది నియామక ప్రక్రియలో భాగంగా సాంకేతిక లోపాన్ని గుర్తించాం. ప్రస్తుతం ఘటనకు మేము క్షమాపణలు కోరుతున్నాం. మొదట చెప్పిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తామని హామీ ఇస్తున్నాం’ అని పేర్కొంది.
కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ప్లాంట్లో పనిచేసే ఉద్యోగులు బయటకు వెళ్లకుండా ఉండేందుకు సంస్థ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. జీరో కొవిడ్ పాలసీ పేరుతో కఠిన ఆంక్షలు విధించారు. దీంతో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు ఇంటి ముఖం చూడక చాలా రోజులైంది. ఈ ఆంక్షలతో విసుగెత్తిన ఉద్యోగులు బుధవారం తెల్లవారుజామున వందలాది మంది ఒక్కసారిగా విధులు బహిష్కరించి బయటకొచ్చి ఆందోళనకు దిగారు. సరైన వసతులు కల్పించడంలేదని, జీతాలు కూడా సక్రమంగా చెల్లించడం లేదని ఉద్యోగులు ఆరోపించారు. కొవిడ్తో బాధపడుతున్న చాలా మంది ఉద్యోగులు ఈ యూనిట్లో ఉన్నప్పటికీ.. వారికి వేరే గదులు కేటాయించడం లేదని ఆందోళన చెందుతున్నారు.