Turkey Earthquake | వరుస భూకంపాలు తుర్కియేను అతలాకుతలం చేసేస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున తుర్కియే, సిరియాలో అత్యంత శక్తివంతమైన మూడు భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 7.8గా నమోదైంది. ఖరమన్మారస్ కేంద్రంగా రెండో భూకంపం 7.7 తీవ్రతతో, మూడవది 7.6 తీవ్రతతో సంభవించినట్లు అధికారులు తెలిపారు. తాజాగా మంగళవారం ఉదయం మరోమారు భూకంపం సంభవించింది. సెంట్రల్ తుర్కియే కేంద్రంగా రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 5.6గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
కాగా, తుర్కియే భూకంప మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం
మృతుల సంఖ్య 4,372కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. కేవలం తుర్కియేలోనే 2,921 మంది
ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ డిజాస్టర్ సంస్థ తెలిపింది. ఇక ఆ దేశంలో గాయపడ్డవారి సంఖ్య 15,834గా ఉన్నట్లు పేర్కొంది. సిరియాలో భూకంపం వల్ల సుమారు 1,451 మంది మరణించారు. మరో 3,531 మంది గాయపడ్డారు. భారీ భూప్రకంపలన కారణంగా సుమారు ఐదువేలకు పైగా భారీ భవంతులు పేకమేడల్లా క్షణాల్లో కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు తుర్కియేలో ప్రభుత్వం ఏడురోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. వరుస భూకంపాలతో
ఆ దేశం అతలాకుతలమైనట్లు అధ్యక్షుడు రీసెప్ తయ్యిప్ ఎర్గగోడ్ తెలిపారు. తుర్కియేలో సుమారు 185
సార్లు భూ ప్రకంపనలు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. తుర్కియేలో వచ్చిన భూకంపం వల్ల
గ్రీన్ల్యాండ్లో కూడా ప్రకంపనలు నమోదు అయినట్లు డెన్మార్క్ జియోలాజికల్ సర్వే పేర్కొన్నది. 1999లో
వచ్చిన 7.4 తీవ్రత భూకంపం తర్వాత ఇదే పెద్ద కంపమని ఇస్తాంబుల్ అధికారులు వెల్లడించారు. ఆ ఏడాది
వచ్చిన భూకంపంలో 17వేల మంది మరణించారు. ప్రస్తుతం దక్షిణ తుర్కియేలో రెస్క్యూ ఆపరేషన్
కొనసాగుతోంది. అమెరికా, భారత్తో పాటు చాలా వరకు దేశాలు సహాయాన్ని అందిస్తున్నాయి.