ఇండియానాపోలిస్: అమెరికాలో ఇండియానాపోలిస్లో ఉన్న ఫెడెక్స్ కొరియర్ సంస్థ వద్ద జరిగిన కాల్పుల ఘటనలో ఎనిమిది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. మృతిచెందిన వారిలో భారత సంతతికి చెందిన నలుగురు సిక్కులు ఉన్నారు. ఆ ఘటన పట్ల విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇండియానాపోలిస్ విమానాశ్రయం వద్ద ఉన్న ఫెడెక్స్ కొరియర్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో సుమారు 90 శాతం మంది ఇండియన్-అమెరికన్లే ఉన్నారు. అందులోనూ సిక్కు మతస్తులే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇండియానాపోలిస్ నగరంలో కాల్పలు ఘటనలు చోటుచేసుకోవడం ఈ ఏడాది ఇది మూడవసారి. శుక్రవారం కాల్పుల్లో మృతిచెందినవారి పేర్లను రిలీజ్ చేశారు. అమర్జీత్ జోహల్(66), జశ్విందర్ కౌర్(64), అమర్జిత్ స్కాన్(48), జశ్విందర్ సింగ్(68) ఉన్నారు. వీరిలో మొదటి ముగ్గురు మహిళలే.
కాల్పులకు తెగించిన సాయుఢిని 19 ఏళ్ల బ్రాండెన్ హోల్గా గుర్తించారు. అయితే అతను ఎందుకు కాల్పులు జరిపాడో ఇంకా పోలీసులు తేల్చలేదు. చికాగోలో ఉన్న కౌన్సులేట్ అధికారులు అమెరికాతో టచ్లో ఉన్నట్లు మంత్రి జైశంకర్ తెలిపారు. ఈ ఘటనలో గాయపడ్డవారిలో హర్ప్రీత్ గిల్ అనే వ్యక్తి కూడా ఉన్నారు. ఫెడెక్స్లో ఫైరింగ్ జరుగుతోందని పారిపోయేందుకు హర్ప్రీత్ ప్రయత్నించాడు, ఆ సమయంలో ఓ బుల్లెట్ అతని ముఖంలోకి దిగింది. ప్రస్తుతం అతనికి సర్జరీ చేస్తున్నారు. ఇండియానాపోలిస్లో జరిగిన ఘటన పట్ల సిక్కు కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రజ్వత్ సింగ్ సంతాపం ప్రకటించారు. కాల్పుల ఘటన దేశానికి అవమానకరమని అధ్యక్షుడు బైడెన్ అన్నారు. మృతులకు నివాళిగా అమెరికా జాతీయ పతాకాన్ని అవనతం చేయనున్నారు.