హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కొవిడ్-19 మహమ్మారి కారణంగా 40 లక్షల మందికిపైగా ప్రజలు మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) బుధవారం తెలిపింది. సంపన్న దేశాలు ఒకవైపు ఆంక్షలను సడలిస్తుండగా మరోవైపు ఆసియా దేశాలు తాజా కేసులతో పోరాడుతున్నాయని పేర్కొంది. ఆసియావ్యాప్తంగా నూతన లాక్డౌన్లు ఏర్పాడుతున్నట్లు తెలిపింది. కొవిడ్ మరణాల రేటు నెలలో పదిరెట్లు పెరిగి గ్లోబల్ హాట్స్పాట్గా ఇండోనేషియా నిలుస్తోందని, బుధవారం ఒక్కరోజే ఇండోనేషియాలో 1,040 మరణాలు సంభవించినట్లు డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అధనమ్ గెబ్రెయేసన్ తెలిపారు. వాస్తవానికి ఈ సంఖ్య ఎక్కువే ఉంటుందని ఆయన అన్నారు. కొవిడ్ మహమ్మారితో ప్రపంచం ప్రమాదకరస్థితిలో ఉందన్నారు.
ఇండోనేషియాలో వీలైనంత ఎక్కువగా ఇంటి నుంచే పని చేయాల్సిందిగా ప్రజలకు ఆయన సూచించారు. వియాత్నాంలోని హో చి మిన్ సిటీ, మయన్మార్లోని యాంగోన్లలో లాక్డౌన్ను విధించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ రెండు నగరాల్లో 15 మిలియన్లకు పైగా ప్రజలు లాక్డౌన్లో ఉన్నట్లు చెప్పారు. సిడ్నీలోని ఐదు మిలియన్ల నివాసితులు ఇప్పటికే రెండు వారాల లాక్డౌన్లో ఉండగా కొత్తగా 27 కేసులు వెలుగులోకి రావడంతో మరో వారం రోజులు లాక్డౌన్ను అక్కడి ప్రభుత్వం పొడిగించిందన్నారు. బ్రిటన్లో సైతం కేసులు అధిక సంఖ్యలో నమోదు అయితున్నప్పటికీ మాస్ వ్యాక్సినేషన్ కారణంగా ఆస్పత్రిలో చేరడాలు, మరణాలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయన్నారు.
చైనాలో వైరస్ వెలుగులోకి వచ్చి 18 నెలలు అయినప్పటికీ ప్రపంచం ముందుకు సాగేందుకు ఇంకా కష్టపడుతోందన్నారు. టీకాలు, రక్షణ పరికరాలను నిల్వ చేయడంపై ధనిక దేశాలను టెడ్రోస్ ఆక్షేపించారు. మహమ్మారి ఇప్పటికే ముగిసినట్లుగా సంపన్న ప్రపంచం వ్యవహరిస్తోందన్నారు. క్రీడల విషయానికి వస్తే ప్రేక్షకులు లేకుండా ఆడటం లేదా వాయిదా వేసుకోవడం లేదంటే పూర్తిగా రద్దు చేసుకోవడమే మంచిదన్నారు.
టీకా రేటుతో సంబంధం లేకుండా వైరస్ వ్యాప్తి పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. మాస్ టూరిజంతో సంపన్న దేశాల ప్రజలు సాధారణ జీవనంపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు తెలిపారు. పేద దేశాల్లో మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ధనిక దేశాలు ఆంక్షల సడలింపును వెనక్కి తీసుకోవాలన్నారు. తమ దగ్గర ఉన్న వనరులను ధనిక దేశాలు పంచుకోవాల్సిందిగా ఆయన కోరారు. ప్రపంచం అంతా సామూహికంగా ఒక్కటై ఈ మహమ్మారిని ఎదుర్కోవాల్సిందిగా పేర్కొన్నారు.
The world is at a perilous point in the #COVID19 pandemic. We have just passed the tragic milestone of 4 million recorded deaths, which likely underestimates the overall toll. It didn’t have to be this way and it doesn’t have to be this way going forward. #VaccinEquity pic.twitter.com/xA2cYsGgan
— Tedros Adhanom Ghebreyesus (@DrTedros) July 7, 2021