Sai Srinivas | టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. హైదరాబాద్కు చెందిన కావ్య రెడ్డితో ఆయన నిశ్చితార్థం నగరంలోని ఓ ప్రైవేట్ రిసార్ట్లో అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరైన ఈ వేడుక ఎంతో ఆహ్లాదకరంగా సాగింది. ఈ సందర్భంగా వధూవరులిద్దరూ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. శ్రీనివాస్ కుర్తాలో అందంగా కనిపించగా, కావ్య రెడ్డి సంప్రదాయ లెహంగా లో ఆకట్టుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఆకర్షిస్తున్నాయి.
ప్రఖ్యాత నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడైన శ్రీనివాస్, ‘అల్లుడు శ్రీను’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. యాక్షన్, కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన, గత ఏడాది ‘కిష్కింధపురి’తో విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం తన కెరీర్లో బిజీగా ఉన్నప్పటికీ, వ్యక్తిగత జీవితంలో కొత్త అడుగు వేయడం విశేషంగా మారింది. కాబోయే వధువు కావ్య రెడ్డి కుటుంబ నేపథ్యం కూడా పెద్దదే. ఆమె తాతగారు రిటైర్డ్ జడ్జి కాగా, తండ్రి ప్రముఖ న్యాయవాది. పెద్దలు కుదిర్చిన ఈ వివాహం అయినప్పటికీ, వీరిద్దరి మధ్య కొంతకాలంగా పరిచయం ఉందని సమాచారం. ఇప్పటికే మార్చి నెలలోనే తన కాబోయే భార్యను అభిమానులకు పరిచయం చేసిన శ్రీనివాస్, ఇప్పుడు నిశ్చితార్థంతో పెళ్లి దిశగా అడుగులు వేస్తున్నారు.
వివాహం ఈ నెల 29న పవిత్ర క్షేత్రం తిరుమల లో అత్యంత సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా జరగనుంది. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సినీ రంగంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతుండటం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. త్వరలో జరిగే వివాహ వేడుకపై కూడా భారీ ఆసక్తి నెలకొంది.