సూర్యాపేట, నమస్తేతెలంగాణ : నెల రోజుల శ్రమ.. నాలుగు రోజుల ఆట.. దేశం మొత్తం సూర్యాపేటకు పయనమైన వేళ.. ఎందరో క్రీడాకారులు.. మరెందరో వీక్షకుల నడుమ హోరాహోరీగా సాగాయి. దీంతో సూర్యాపేట పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. దేశం గర్వించే స్థాయిలో జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయ మైదానంలో నిర్వహించిన 47వ జాతీయ జూనియర్ కబడ్డీ పోటీలు గత నాలుగు రోజులుగా ఎంతో ఉత్కంఠ రేపుతూ గురువారం రాత్రి విజయవంతంగా ముగిశాయి. దేశవ్యాప్తంగా ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన బాలబాలికల జట్లతో సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొత్త వాతావరణం కనిపించింది. ఫ్లడ్ లైట్ల వెలుగులో పగటిని తలపించేలా రాత్రి క్రీడలకు ఏర్పాటు చేసి ఆటకు ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించారు. ఇండోర్ స్టేడియంలో నిర్వహించాల్సిన క్రీడలను అవుట్డోర్లో నిర్వహించే సాహసం చేయడమే కాకుండా విజయవంతం చేయడం పట్ల క్రీడాకారులు సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. వసతి, భోజన సౌకర్యాలతోపాటు ఏర్పాట్లు అన్నీ బాగున్నాయని కితాబిచ్చారు. నాలుగు రోజులుగా సుమారు 142మ్యాచ్లు జరుగగా, అందులో 60మ్యాచ్లు తీవ్ర ఉత్కంఠను రేకెత్తించాయి. సాధారణంగా పెద్దస్థాయిలో క్రీడలు నిర్వహించే క్రమంలో చిన్న చిన్న లోపాలు జరుగుతుంటాయి. ఆ లోటుపాట్లతో క్రీడాకారులు ఆటను సరిగా ఆడలేరు. కానీ, ఇక్కడి ఏర్పాట్లలో అలాంటిదేమీ లేకుండా క్రీడాకారులకు కావాల్సిన అన్నిరకాల ఏర్పాట్లను చేయడంతో క్రీడకారులు తమ స్వరాష్ట్రంలో ఆడినట్లుగా భావించి స్వేచ్ఛగా కబడ్డీ ఆడి తమ ప్రతిభను నిరూపించుకున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంతోపాటు దేశవ్యాప్తంగా క్రీడాకారులు, క్రీడాభిమానులు, అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు కావడంతోపాటు క్రీడలను వీక్షించేందుకు ప్రజలు భారీగా రావడంతో క్రీడా ప్రాంగణం కిక్కిరిసిపోయింది.