ఆహార సంక్షోభంతో శ్రీలంకలో నిత్యావసరాల ధరలు భగ్గు
కొలంబో, అక్టోబర్ 11: ఆహార సంక్షోభంతో శ్రీలంక కొట్టుమిట్టాడు తున్నది. నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. కిలో పాలపొడి ధర రూ.1,195కు చేరింది. సిలిండర్ ధర రూ.2,657కు పెరిగింది. చక్కెర, గోధుమ పిండి, బియ్యం, సిమెంటు ఇలా ప్రతీదాని ధర రెట్టింపు, అంతకంటే ఎక్కువగా పెరిగింది. నిత్యావసరాల ధరలపై ఇప్పటి వరకు ఉన్న నియంత్రణను ఎత్తివేయడమే ఇందుకు కారణం. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొవిడ్తో తీవ్రమైంది. డబ్బు లేక దిగుమతులు తగ్గాయి. ఇది ఆహార సంక్షోభానికి దారితీసింది. ఇదే సమయంలో కొవిడ్ దృష్ట్యా ప్రభుత్వం నిత్యావసరాల ధరలపై నియంత్రణ విధించింది. వ్యాపారులు నిత్యావసరాలను అమ్మకుండా నిల్వ చేసుకొన్నారు. సెప్టెంబర్లో ఎమర్జెన్సీ విధించినా పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో అధ్యక్షుడు రాజపక్స అధ్యక్షతన సమావేశమైన శ్రీలంక క్యాబినెట్ ధరలపై నియంత్రణను ఎత్తేయాలని నిర్ణయించింది. అలాగైనా వ్యాపారుల దగ్గర నిల్వ ఉన్న ఆహార పదార్థాలు మార్కెట్లోకి వస్తాయని, ఆహార సంక్షోభం తీరుతుందని భావించింది. అయితే, ధరలు భారీగా పెరగడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.