Congo Floods | సెంట్రల్ కాంగోలో భారీ వర్షాలతో వరదలు పోటెత్తాయి. వరదల ప్రభావంతో 22 మంది మృతి చెందారని, ఇందులో ఒకే కుటుంబానికి చెందిన పది మంది ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. కసాయి సెంట్రల్ ప్రావిన్స్లోని కనంగా జిల్లాలో జడివానకు అనేక ఇండ్లు, నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. వరదల్లో పలుచోట్ల చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ప్రావిన్స్ గవర్నర్ జాన్ కబేయా పేర్కొన్నారు. బికుకులో గోడ కూలడంతో ఒకే కుటుంబానికి చెందిన అందరూ చనిపోయారని కబేయా పేర్కొన్నారు.
వరద కారణంగా భారీగా నష్టం జరిగిందని ది హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఫర్ ఇంటిగ్రల్ డెవలప్మెంట్ ప్రభుత్వేతర సంస్థ కంట్రీ డైరెక్టర్ నథాలీ కంబాలా పేర్కొన్నారు. కాంగోలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో తరుచూ భారీగా వరదలు సంభవిస్తుంటాయి. మే నెలలో తూర్పు కాంగోలోని సౌత్ కివు ప్రావిన్స్లో రాత్రి సమయంలో కుండపోత వర్షాలు కురిశాయి. ఒక్కసారిగా వరదలకు కొండచరియలు విరిగిపడడంతో 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. తాజా వరదల్లో దెబ్బతిన్న నిర్మాణాల్లో హయ్యర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ కనంగా సైతం ఉన్నది. వర్షాలకు తూర్పు కాంగోలో ఆదివారం అర్ధరాత్రి కొండచరియలు విరిగిపడి కనీసం నలుగురు మృతి చెందగా.. 20 మంది గల్లంతయ్యారు.