కాబూల్: ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) నుంచి అమెరికా తన బలగాలను పూర్తిగా తరలించడానికి ఒక రోజు ముందు కాబూల్ ఎయిర్పోర్ట్పై రాకెట్ల దాడి జరిగింది. ఎయిర్పోర్ట్ లక్ష్యంగా ఉగ్రవాదులు ఐదు రాకెట్లను ఫైర్ చేశారు. అయితే వీటిని మిస్సైల్ రక్షణ వ్యవస్థ సమర్థంగా అడ్డుకున్నట్లు అమెరికా అధికారి ఒకరు రాయ్టర్స్కు వెల్లడించారు. కానీ ఇందులో ఒక రాకెట్ మాత్రం ఎయిర్పోర్ట్ పక్కేనే ఉన్న ఓ నివాసిత భవనానికి తగిలింది.
ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఆగస్ట్ 31లోపు మొత్తం అమెరికా బలగాలను తరలిస్తామని బైడెన్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు ఇంకా ఒక రోజు సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే కాబూల్ ఎయిర్పోర్ట్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటామని తాలిబన్లు ప్రకటించారు. ఇప్పటి వరకూ అమెరికా కాబూల్ ఎయిర్పోర్ట్ నుంచి లక్షా 20 వేల మందిని తరలించింది.
మంగళవారం చివరి అమెరికా విమానం అక్కడి నుంచి వెళ్లనుంది. కాబూల్ ఎయిర్పోర్ట్లో రెండు ఆత్మాహుతి దాడులు వంద మందికిపైగా బలితీసుకున్న విషయం తెలిసిందే. అలాంటిదే మరో దాడిని ఆదివారం అమెరికా బలగాలు అడ్డుకోగలిగాయి. పేలుడు పదార్థాలున్న ఓ వాహనాన్ని పేల్చేశారు.