Pakistan | ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో ఎన్నిలు జరుగుతున్న వేళ మరో ఉగ్రదాడి చోటు చేసుకుంది. ఈ దాడిలో ఐదుగురు పోలీసులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులు డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో బాంబు దాడులకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.
పోలీసులు ప్రయాణిస్తున్న మొబైల్ వ్యాన్ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఐఈడీ పేల్చారు. అనంతరం 30 నిమిషాల పాటు కాల్పులు జరిపారు. దీంతో ఐదుగురు పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలింగ్ స్టేషన్కు సమీపంలోనే ఈ ఘటన జరిగింది. అయితే మహిళల కోసం కేటాయించిన పోలింగ్ స్టేషన్లోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 241 మిలియన్ల జనాభా ఉన్న పాకిస్తాన్లో 128 మిలియన్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.