Iran Oil Cargo : ఇరాన్ నుంచి ఏడు సంవత్సరాల తర్వాత ఒక చమురు నౌక ఇండియాకు బయల్దేరిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నౌక ఇప్పుడు దారి మార్చుకుని చైనాకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆర్థిక పరమైన అంశాలే కారణమై ఉంటాయని నిపుణుల ప్రాథమిక అంచనా. ఇరాన్ యుద్ధం కారణంగా చమురు సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియాకు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు అమెరికా అనుమతినిచ్చింది. అలాగే, అవసరమైతే ఇరాన్ నుంచి కూడా చమురు కొనొచ్చని సూచించింది.
ఈ నేపథ్యంలో ఇరాన్కు చెందిన పింగ్ షున్ అనే చమురు నౌక ఇండియాకు బయల్దేరింది. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ఇండియాకు బయల్దేరింది. ఈ నెల 4న గుజరాత్లోని వడినార్ పోర్టుకు రావాల్సి ఉంది. కానీ, ఇప్పుడు ఈ నౌక, మార్గం మధ్యలో తన దిశ మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇండియా రావాల్సిన ఈ చమురు నౌక ఇప్పుడు చైనా వైపు కదుల్తోందని షిప్ ట్రాకింగ్ సంస్థ కెప్లర్ తెలిపింది. పింగ్ షున్ నౌకలోని ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఏఐఎస్) ప్రస్తుతం చైనా దిశను సూచిస్తోందని వెల్లడించింది. వాణిజ్య నౌకల్ని కెప్లర్ ట్రాక్ చేస్తుంటుంది. అప్పుడప్పుడూ ఇలా ఈ నౌకలు దిశను మార్చుకోవడం మామూలే అని తెలుస్తోంది. మూడు రోజులక్రితం బయల్దేరిన ఈ నౌక మొదట ఇండియా మార్గంలోనే ప్రయాణించింది. 2022లో నిర్మితమైన ఈ నౌకపై గతంలో అమెరికా ఆంక్షలు విధించింది. ఇరాన్ నుంచి ఇండియా గతంలో భారీగా చమురు కొనేది. కానీ, ఇరాన్ నుంచి చమురు దిగుమతులపై అమెరికా ఆంక్షలు విధించింది.
దీంతో 2019 నుంచి ఇప్పటివరకు ఇరాన్ చమురును కొనుగోలు చేయడాన్ని ఇండియా నిలిపివేసింది. తాజాగా, అమెరికా ఆంక్షలు ఎత్తివేయడంతో ఇరాన్ చమురు నౌక ఇండియా బయల్దేరింది. అయితే, ఇండియా రావాల్సిన నౌక ఇప్పుడు అకస్మాత్తుగా వేరే దేశానికి వెళ్లడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై అధికారిక ప్రకటన లేదు. చమురు నౌకకు చేయాల్సిన చెల్లింపుల నిబంధనల్లో మార్పుల కారణంగానే ఈ నౌక చైనా వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా ఒక చమురు నౌకకు 30-60 రోజుల వరకు చెల్లింపులకు అవకాశం ఉండేది. అయితే, ఇప్పుడు కొంత ముందుగానే చెల్లించాలని కోరడం వంటి నిబంధనల కారణంగా ఈ పరిస్తితి తలెత్తినట్లు సమాచారం. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు.