కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత తొలిసారి అంతర్జాతీయ విమానం కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. ఆగస్ట్ 30న అమెరికా, విదేశీ దళాలు ఆ దేశం నుంచి పూర్తిగా వైదొలగాయి. సుమారు లక్షన్నర మంది ప్రజలను ఇతర దేశాలకు సురక్షితంగా తరలించాయి. అనంతరం కాబూల్ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అయితే ఈ నెల 3 నుంచి స్థానిక విమాన సేవలను పునరుద్ధరించారు. ఖతార్, ఇతర దేశాల సాంకేతిక సహాయంతో అంతర్జాతీయ విమాన సేవల పునరుద్ధరణకు తాలిబన్ నానా తంటాలు పడుతున్నది.
ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ నుంచి తొలి పాకిస్థాన్ అంతర్జాతీయ ఎయిర్వేస్ (పీఐఏ) విమానం కాబూల్లో దిగింది. అయితే అందులో ఒక్క విదేశీ ప్రయాణికుడైనా లేడని విమానంలో ప్రయాణించిన ఏఎఫ్పీ జర్నలిస్ట్ తెలిపారు. కేవలం పది మంది సిబ్బందితో ఆ విమానం కాబూల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యిందని చెప్పారు. కాగా, ఆఫ్ఘన్ నుంచి వెళ్లాలనుకునే ప్రజలు సరైన పత్రాలు కలిగి ఉంటే స్వేచ్ఛగా వెళ్లనిస్తామని తాలిబన్లు ఇటీవల పదేపదే పేర్కొన్నారు. అయితే తాలిబన్ల హయాంలో అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆ దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు పాకిస్థాన్ అంతర్జాతీయ విమానం దిగడంపై కాబూల్ విమానాశ్రయ సిబ్బంది కొంత ఆశాభావం వ్యక్తం చేశారు. మరిన్ని దేశాలు కూడా తమ సర్వీసులను పునరుద్ధరించవచ్చన్న భావనలో వారు ఉన్నారు. కాగా, అంతర్జాతీయ సంస్థలైన వరల్డ్ బ్యాంక్ వంటి వాటికి చెందిన సిబ్బంది, వారి బంధువులు సుమారు వంద మంది వరకు పాకిస్థాన్ విమానంలో ఇస్లామాబాద్ చేరేందుకు వేచి ఉన్నట్లు కాబూల్ విమానాశ్రయ సిబ్బంది వెల్లడించారు.