పారిస్ : ఫ్రాన్స్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొవిడ్ ఐదో దశ దేశంలో త్వరలో ప్రారంభం కావొచ్చునని.. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని ఫ్రెంచ్ ఆరోగ్యమంత్రి ఆలివర్ వెరాన్ హెచ్చరించారు. ఇది గతంలో వాటికంటే ప్రమాదకరమైందని, దాని నివారించడానికి ఉన్న ఏకైక మార్గం కొవిడ్ ప్రోటోకాల్స్ను పాటించడమేనన్నారు. దేశంలో కరోనా మహమ్మారి విధ్వంసం ఇంకా ముగియలేదని, కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని వెరాన్ సూచించారు.
తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ మధ్య నుంచి దేశంలో కరోనా కేసులు నిరంతరంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. టీకాలు, మాస్క్లు, పరిశుభ్రతతో ఐదో వేవ్ను మరింత సమర్థవంతంగా ఎదుర్కోగలమని ఆలివర్ అన్నారు. ఫ్రాన్స్ వ్యాప్తంగా బుధవారం 11,883 కొత్త కేసులు నమోదయ్యాయి. 10వేలకుపైగా కొవిడ్ కేసులు నమోదవడం వరుసగా రెండోరోజు. ఇప్పటి వరకు 73.46లక్షల మంది మహమ్మారి బారిన పడగా.. వైరస్ బారినపడి 1.19లక్షల మందికిపైగా మృత్యువాతపడ్డారు.