ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో ఒకడు, ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ వ్యవస్థాపకుడైన మార్క్ జుకర్బర్గ్కు భారీ షాక్ తగిలింది. ఫేస్బుక్లో ఆయన 11 కోట్ల మందికిపైగా ఫాలోవర్లను కోల్పోయారు. ఇలా జుకర్బర్గ్ ఒక్కడే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది భారీ సంఖ్యలో ఫేస్బుక్ ఫాలోవర్లను కోల్పోయారు. దీనిపై బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్ ట్వీట్ కూడా చేశారు.
‘ఫేస్బుక్ ఒక పెద్ద సునామీ సృష్టించింది. దానిలో నాకు ఉన్న వారిలో 9 లక్షలమందికిపైగా ఫాలోవర్లు కొట్టుకుపోయారు. కేవలం 9 వేలమంది మాత్రమే ఒడ్డుకు కొట్టుకొచ్చారు. ఫేస్బుక్ చేసిన ఈ కామెడీ భలే ఉంది’ అంటూ ఆమె రాసుకొచ్చారు. దీనిపై మెటా సంస్థ ప్రతినిధులు స్పందించారు. కొంతమంది ఫాలోవర్ల సంఖ్యలో తేడాలు వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ పరిస్థితిని సాధ్యమైనంత త్వరగా చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని వాళ్లు తెలిపారు. యూజర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు చెప్పారు.