గాజా: ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం (Israel-Hamas War) గత ఎనిమిది నెలలుగా కొనసాగుతున్నది. అసలు ఎప్పుడు ముగుస్తుందనేదీ ఇప్పట్లో తేలేలా లేదు. హమాస్ తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా (Hezbollah) ఇజ్రాయెల్కు హెచ్చరికలు జారీ చేసింది. త్వరలో తమ నుంచి ‘సర్ప్రైజ్’ అందుకోబోతున్నది అంటూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసింది. సర్ప్రైజ్ అందుకునేందుకు సిద్ధంగా ఉండాలంటూ హెజ్బొల్లా సెక్రటరీ జనరల్ హసన్ నస్రల్లాహ్ అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో లెబనాన్కు చెందిన ఉగ్ర సంస్థ ఇజ్రాయెల్పై మెరుపు దాడులకు సిద్ధమవుతున్నదని విశ్లేషణలు వెలువడుతున్నాయి.
ఇప్పటి వరకు జరిగిన పోరులో తాము ఏమీ సాధించలేకపోయామని స్వయంగా ఇజ్రాయెల్ అంగీకరించిందని నస్రల్లాహ్ తన సందేశంలో పేర్కొన్నారు. పైగా ఐరోపా దేశాలు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడం వారికి పెద్ద ఎదురుదెబ్బ అని వ్యాఖ్యానించారు. హమాస్ పోరాటం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. గాజా, రఫాలో ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను పాటించడం లేదని ఆరోపించారు. అంతర్జాతీయ కోర్టు ఆదేశించినప్పటికీ రఫాలో దాడులకు పాల్పడుతున్నదని వెల్లడించారు. ఇజ్రాయెల్లో పోరులో పాలస్తీనకు మద్దతుగా హెజ్బొల్లా పాల్గొంటున్న విషయం తెలిసిందే.
దక్షిణ గాజాలోని పాలస్తీనీయులపై ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతోందంటూ దక్షిణాఫ్రికా చేసిన ఫిర్యాదుపై అంతర్జాతీయ న్యాయస్థానం రెండు రోజుల క్రితం కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. రఫా పట్టణంపై సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలని ఇజ్రాయెల్ను ఆదేశించింది. పాలస్తీనాలో రోజురోజుకు పరిస్థితులు క్షీణించిపోయాయని, వాటిని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఇజ్రాయెల్ను ఆదేశించినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. రఫా ప్రభుత్వానికి ఆటంకం కలిగేలా ఇజ్రాయెల్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించింది. మానవతా దృక్పథంతో ఈజిప్ట్-గాజా సరిహద్దును కూడా తెరవాలని, అలాగే దీని పురోగతిపై నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను నెతన్యాహూ ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.