ఇస్లామాబాద్: లష్కరే తొయీబా (LeT) మాజీ కమాండర్, భారత వ్యతిరేక ప్రసంగాలకు పేరుగాంచిన అక్రమ్ ఖాన్ (Akram Khan) పాకిస్థాన్లో హత్యకు గురయ్యారు. గురువారం ఖైబర్ పఖ్త్న్ఖ్వా ప్రావిన్స్లోని బాజౌర్ జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను కాల్చి చంపారు. అక్రమ్ ఖాన్ అలియాస్ అక్రమ్ గాజీ 2018 నుంచి 2020 వరకు లష్కరే రిక్రూట్మెంట్ సెల్ (Recruitment cell) చీఫ్గా కొనసాగారు. తన భారత వ్యతిరేక ప్రసంగాలతో యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేవారు.
పఠాన్కోట్ ఉగ్రదాడి సూత్రధారి షాహిద్ లతీఫ్ను (Shahid Latif) దుండగులు గత అక్టోబర్లో కాల్చి చంపిన విషయం తెలిసిందే. భారతదేశ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకడైన లతీఫ్ స్వస్థలం పాకిస్థాన్లోని గుజ్రాన్వాలా. 2016లో ఆయన నేతృత్వంలోనే పఠాన్కోట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లోకి చొరబడిన నలుగురు ముష్కరులు విధ్వంసం సృష్టించారు. ఇక సెప్టెంబర్ మొదటివారంలో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని రావల్కోట్లో ఉన్న అల్ ఖుదుస్ మసీదులో లష్కర్ కమాండర్ రియాజ్ అహ్మద్ (Riyaz Ahma) అలియాస్ అబూ ఖాసిమ్ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు.