న్యూఢిల్లీ, జూన్ 30: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జన్మతః పౌరసత్వాన్ని పరిమితం చేసేందుకు ట్రంప్ జారీచేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని అమెరికా సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఇమిగ్రేషన్ విధానం, రాజ్యాంగ చట్టంపై గణనీయమైన ప్రభావం చూపే చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. అమెరికా గడ్డపై జన్మించిన దాదాపు అందరు పిల్లలకు పౌరసత్వం కల్పించే 14వ సవరణకు చెందిన దీర్ఘకాలిక వ్యాఖ్యానాన్ని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. అమెరికాలో జన్మించిన పిల్లల తల్లిదండ్రులు దేశంలో అక్రమంగా ఉన్నా, లేదా తాత్కాలిక వీసాలపై ఉన్నా ఆ పిల్లలకు స్వయంచాలకంగా లభించే పౌరసత్వాన్ని నిరాకరించాలని 2025 జనవరిలో ట్రంప్ రెండవసారి అధ్యక్ష పదవి చేపట్టిన మొదటి రోజున సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లక్ష్యంగా పెట్టుకుంది.
తల్లిదండ్రుల్లో కనీసం ఒకరు అమెరికా పౌరుడిగా లేదా చట్టబద్ధమైన శాశ్వత నివాసిగా ఉన్న పిల్లలకు మాత్రమే పౌరసత్వాన్ని ఈ చర్య ప్రధానంగా పరిమితం చేసేది. ట్రంప్ వలస విధాన అజెండాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలేలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని నిలిపివేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు 6-3 తీర్పుతో సమర్థించింది. జన్మతః పౌరసత్వంపై ప్రస్తుత వ్యాఖ్యానం వలస వ్యవస్థ దుర్వినియోగాన్ని ప్రోత్సహిస్తుందని ట్రంప్ చాలా కాలంగా వాదిస్తుండగా ఆయన పరిపాలన వివక్షాపూరిత వలస విధానాలను అనుసరిస్తున్నదని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
ఈ కేసు అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణకు చెందిన పౌరసత్వ నిబంధనపై కేంద్రీకృతమై ఉంది. దాని ప్రకారం అమెరికాలో జన్మించిన లేదా సహజసిద్ధంగా పౌరసత్వం పొందిన, దాని అధికార పరిధికి లోబడి ఉన్న వ్యక్తులందరూ అమెరికన్ పౌరులే. విదేశీ దౌత్యవేత్తలు లేదా శత్రు ఆక్రమణ దళాల పిల్లలు తప్పించి తల్లిదండ్రుల వలస స్థితితో సంబంధం లేకుండా అమెరికాలో జన్మించిన పిల్లలందరికీ పౌరసత్వాన్ని హామీ ఇచ్చే నిబంధనగా దీనిని 150 ఏండ్లకు పైగా సాధారణంగా అందరూ అర్థం చేసుకున్నారు. కాగా, ట్రంప్ జారీచేసిన ఉత్తర్వు విస్తృతమైన పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు ఇదివరకు హెచ్చరించారు.
అమెరికాలో ఏటా జన్మించే దాదాపు 2.50 లక్షల మంది శిశువులపై దీని ప్రభావం పడే అవకాశం ఉందని, అలాగే లక్షలాది కుటుంబాలు తమ నవజాత శిశువుల పౌరసత్వ హోదాను నిరూపించుకోవలసిన పరిస్థితి ఏర్పడేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఏదేమైనా ట్రంప్ వలస విధాన అజెండాకు సుప్రీంకోర్టు తీర్పు ఒక అరుదైన అడ్డంకిగా మారింది. ఆయన తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి వలసలకు సంబంధించిన అనేక వివాదాల్లో సుప్రీంకోర్టులోని సంప్రదాయవాద మెజారిటీ వర్గం చాలా వరకు ప్రభుత్వానికే మద్దతుగా నిలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అధ్యక్షుడు ట్రంప్ విధించిన విస్తృతమైన ప్రపంచవ్యాప్త సుంకాలను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. తద్వారా ఆయన పరిపాలనా యంత్రాంగానికి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల కోసం చేసే ఖర్చుపై ఉన్న పరిమితులను అమెరికా సుప్రీంకోర్టు మంగళవారం ఎత్తివేసింది. ఐదు దశాబ్దాలకుపైగా అమల్లో ఉన్న ఫెడరల్ ఎన్నికల చట్టాన్ని కొట్టివేస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. కాంగ్రెస్, అధ్యక్ష ఎన్నికల్లో పార్టీలు తమ అభ్యర్థులతో సమన్వయం చేసుకుంటూ వెచ్చించే నిధులపై ఇకపై ఎటువంటి ఆంక్షలు ఉండవు. రిపబ్లికన్ పార్టీ మద్దతుతో దాఖలైన ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనంలోని కన్జర్వేటివ్ న్యాయమూర్తులు మెజారిటీ తీర్పును వెలువరించారు. ప్రస్తుత ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఈ కేసులో ఒక పక్షంగా ఉన్నారు. 2010లో వచ్చిన సిటిజన్స్ యునైటెడ్ తీర్పు ద్వారా ఇప్పటికే ఎన్నికల్లో స్వతంత్రంగా చేసే ఖర్చుపై పరిమితులు తొలగిపోగా, తాజా ఈ తీర్పుతో పార్టీల ప్రత్యక్ష సమన్వయ ఖర్చుకు కూడా మార్గం సుగమమైంది.