న్యూఢిల్లీ, జూన్ 29 : ఆధునిక చరిత్రలో అత్యంత తీవ్రమైన వడగాడ్పుల పరిస్థితిని ఐరోపా ఖండం ఎదుర్కొంటున్నది. అనేక దేశాలలో ప్రమాదకర స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ మరణాల సంఖ్యను పెంచివేస్తున్నాయి. జర్మనీ, ఫ్రాన్స్ నుంచి ఇటలీ, స్పెయిన్ వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు ప్రజల దైనందిన జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతూ ఆందోళన రేకెత్తిస్తున్నాయి. వేడి తీవ్రతకు రోడ్లు సైతం కరిగిపోతున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. వడగాడ్పుల కారణంగా ఏర్పడుతున్న ఆరోగ్య సమస్యకు అత్యవసర సేవలు వేగంగా స్పందిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో ప్రభుత్వాలు ప్రజలకు తక్షణ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. మరణాలు పెరుగుతుండడం, మౌలిక సదుపాయాలు ఇబ్బందులు పడుతుండడంతో ప్రస్తుత వడగాడ్పులు ఇటీవలి దశాబ్దాలలో ఐరోపాలో అత్యంత ఆందోళనకరమైన వాతావరణ అత్యవసర పరిస్థితుల్లో ఒకటిగా వేగంగా మారుతున్నది.
తీవ్రమైన వడగాడ్పులు ఖండం అంతటా విస్తరిస్తుండడంతో యూరప్లోని అనేక ప్రాంతాలు ప్రస్తుతం తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు అనేక దేశాలలో జనజీవనం, ప్రజారోగ్యం, మౌలిక సదుపాయాలపై ప్రభావం చూపుతున్నాయి. అవసరమైతే తప్ప బహిరంగ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
వడగాలులు తీవ్రం కావడంతో జర్మనీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అనేక చోట్ల ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత డ్రూవిట్జ్ వద్ద 41.5 డిగ్రీలుగా నమోదైంది. సార్బ్రూకెన్ సమీపంలో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రతను నమోదు చేసిన వెంటనే ఇది జరిగింది. పరిస్థితి ఎంత వేగంగా దిగజారుతున్నదో ఇది స్పష్టం చేసింది. అధిక ఉష్ణోగ్రతలకు ట్రాఫిక్ లైట్లు సైతం కరిగిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అత్యంత తీవ్రంగా ప్రభావితమైన దేశాలలో ఫ్రాన్స్ ఒకటి. పారిస్ తీవ్రమైన వేడి ఒత్తిడిని ఎదుర్కొంటున్నది. వేడి సంబంధిత పరిస్థితుల కారణంగా కనీసం 109 మంది మరణించారని నివేదికలు సూచిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు అధికంగానే కొనసాగితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అతిసారం, అలసట, వడదెబ్బ వంటి కేసులు పెరగడంతో దవాఖానలు, అత్యవసర సేవల విభాగాలు సతమతమవుతున్నాయి. ఇటలీ, స్పెయిన్లో వేడికి రోడ్లకు సైతం పగుళ్లు ఏర్పడుతున్నాయి.