దుబాయ్, ఏప్రిల్ 18: భారీ వర్షాలు, వరదలతో దుబాయ్ అతలాకుతలం కావడానికి వాతావరణ మార్పులే కారణమని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పులు ప్రపంచానికి పెను ముప్పుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణాన్ని కృత్రిమ పద్ధతులతో ప్రభావితం చేయడం విపరిణామాలకే దారి తీస్తుందని హెచ్చరించారు.
భూతాపం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని వివరించారు. దుబాయ్లో ఆకస్మిక వర్షానికి క్లౌడ్ సీడింగ్ కూడా కారణమై ఉంటుందనే వాదన వినిపిస్తున్నది. క్లౌడ్ సీడింగ్ అంటే కృత్రిమంగా వర్షాలు కురిపించేందుకు, వర్షపాతాన్ని పెంచేందుకు అవలంబించే పద్ధతి. వర్షాభావ పరిస్థితి, నీటి కొరత ఎక్కువగా ఉండే ఏడారి దేశమైన యూఏఈ చాలా ఏండ్లుగా క్లౌడ్ సీడింగ్తొ కృత్రిమ వర్షాలు కురిపిస్తున్నది.