ఎమర్జెన్సీ విధించేందుకు పంజాబ్ ప్రావిన్స్ యోచన
ఇస్లామాబాద్, జూన్ 22: పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో రోజురోజుకూ మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. లైంగికదాడులను నిరోధించడానికి అక్కడ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించేందుకు యోచిస్తున్నది. పంజాబ్ హోం మంత్రి అట్టా తరార్ మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు జరుగడం సమాజానికి, ప్రభుత్వానికి కూడా మంచిది కాదని పేర్కొన్నారు. పంజాబ్ ప్రావిన్సులో ప్రతి రోజూ నాలుగైదు లైంగిక దాడి కేసులు నమోదవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు చెప్పారు.
ఇందుకోసం ఎమర్జెన్సీ విధించేందుకు యోచిస్తున్నట్టు ప్రకటించారు. పౌర సమాజ, మహిళా హక్కుల సంఘాలు, టీచర్లు తదితరులను ఈ విషయంలో సంప్రదిస్తామని తెలిపారు. భద్రత విషయంలో పిల్లలకు అవగాహన కల్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. లైంగిక దాడి నిందితులను చాలామందిని ఇప్పటికే అరెస్టు చేశామని వెల్లడించారు.