36 గంటలు దేశవ్యాప్త కర్ఫ్యూ
అధ్యక్షుడు రాజపక్స ప్రకటన
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో దేశం
40 వేల టన్నుల బియ్యం పంపించాలని భారత్ నిర్ణయం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: ఆర్థిక సంక్షోభంలో పూర్తిగా కూరుకుపోయిన శ్రీలంకలో ప్రజా నిరసనలు ఉద్ధృతం కావడంతో అధ్యక్షుడు రాజపక్స దేశవ్యాప్త ఎమర్జెన్సీ విధించారు. భద్రతా బలగాలకు అపరిమిత అధికారాలనిచ్చారు. నిరసన ప్రదర్శనలు ఎవరు నిర్వహించినా అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల భద్రత, అత్యవసర సేవల కోసం, నిత్యావసర వస్తువుల సరఫరాలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకే ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకొన్నట్టు రాజపక్స పేర్కొన్నారు. ఎమర్జెన్సీ శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చింది. ఎమర్జెన్సీతో పాటు అధ్యక్షుడు రాజపక్స 36 గంటల దేశవ్యాప్త కర్ఫ్యూ విధించారు. కర్ఫ్యూ శనివారం సాయంత్రం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చింది. సోమవారం ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటుంది. నిత్యావసరాల కోసం తప్ప ప్రజలు దేనికీ బయటకు రావొద్దని అధికారులు ఆదేశించారు. గురువారం రాత్రి వేలాది మంది శ్రీలంక పౌరులు అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టారు. శుక్రవారం దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. అధ్యక్ష పదవి నుంచి రాజపక్స దిగిపోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. నిరసన ప్రదర్శనలు హింసాత్మకమయ్యాయి. దీంతో శుక్రవారం అర్ధరాత్రే అధ్యక్షుడు ఎమర్జెన్సీని ప్రకటించారు.
ఆల్ పార్టీ గవర్నమెంట్
శ్రీలంకను ఆహార కొరత తీవ్రంగా వేధిస్తున్నది. నిత్యావసరాల ధరలు ఎన్నో రెట్లు పెరిగాయి. విదేశీ మారక నిల్వలు లేక పెట్రోల్, డీజిల్ దిగుమతి దాదాపు నిలిచిపోయింది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. రోజుకు 13 గంటల విద్యుత్తు కోతలతో దేశ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో సంక్షోభాన్ని ఎదుర్కోవడాన్ని అన్ని పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ప్రకటించాల్సిందిగా మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన రాజపక్సను కోరారు. శుక్రవారం ఆయన నేతృత్వం వహిస్తున్న ఫ్రీడమ్ పార్టీ సభ్యులతో రాజపక్సను కలిశారు. ఆల్ పార్టీ గవర్నమెంట్ను ప్రకటించకపోతే అధికార కూటమి నుంచి వైదొలుగుతామని హెచ్చరించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, శ్రీలంక ప్రభుత్వాన్ని కూల్చేందుకే నిరసనకారులు రోడ్లమీదకు వస్తున్నారని అధ్యక్ష కార్యాలయం ప్రకటనలో ఆరోపించింది.
భారత్ నుంచి 40వేల టన్నుల బియ్యం
తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్న శ్రీలంకకు 40వేల టన్నుల బియ్యాన్ని పంపించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 40వేల టన్నుల ఇంధనాన్ని సీలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డుకు శనివారం అందజేసింది. 500 మిలియన్ డాలర్ల సాయంలో భాగంగా ఈ ఇంధనాన్ని అందజేశారు.