వాషింగ్టన్: సోషల్ మీడియా (Social Media) ప్లాట్ఫామ్ ‘ఎక్స్ (X)’ను సొంతం చేసుకున్నప్పటి నుంచి బిలియనీర్ ఎలాన్ మస్క్ ఇప్పటికే అనేక మార్పులు తీసుకొచ్చారు. ఆ పరంపరను కొనసాగిస్తూ తాజాగా మరో కీలక అప్డేట్ను అందించారు. ప్రీమియం పెయిడ్ సర్వీస్లో రెండంచెల వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు మస్క్ తెలిపారు. దాంతో ఇకపై రెండు రకాల ప్రీమియం ఫీచర్లు యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి.
ప్రస్తుతం ఎక్స్ ప్రీమియం సేవల కోసం నెలకు 8 డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. భారత్లో ఇది రూ.900గా ఉంది. దీనికంటే తక్కువ ధరకే కొత్త ప్రీమియం ప్యాక్ను తీసుకురానున్నారు. అయితే దీంట్లో వాణిజ్య ప్రకటనలు ఉంటాయి. ప్రీమియం ఫీచర్లలో మాత్రం ఎలాంటి కోత ఉండదు. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు కావాలనుకునే వారిని దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త ప్యాక్ను తీసుకొచ్చారు. యాడ్స్ వచ్చినా పరవాలేదనుకుంటే ప్రీమియం ఫీచర్ల కోసం ఈ నూతన ప్యాక్ను పొందవచ్చు.
ఎక్స్ ప్రీమియం సర్వీస్లో మరో అంచె వాణిజ్య ప్రటనలు ఏమాత్రం ఉండని సబ్స్క్రిప్షన్. ఈ ప్యాక్ను తీసుకున్నవారు ప్రీమియం ఫీచర్లతో పాటు ఏమాత్రం యాడ్లు లేని ‘ఎక్స్’ను ఎంజాయ్ చేయవచ్చు. ఫలితంగా టైమ్లైన్ ఎలాంటి యాడ్లు లేకుండా కేవలం మీకు సంబంధించిన కంటెంట్తో మాత్రమే కనిపిస్తుంది.
ప్రీమియం ఫీచర్లలో భాగంగా పోస్ట్లను ఎడిట్ చేయడం, సుదీర్ఘ పోస్ట్లు, నచ్చిన యాప్ ఐకాన్లు, కస్టమ్ నావిగేషన్, టాప్ ఆర్టికల్స్, రీడర్, అన్డూ పోస్ట్, సుదీర్ఘ వీడియో అప్లోడ్ వంటి సేవలను పొందవచ్చు. అయితే, కొత్తగా తీసుకురాబోతున్న ప్లాన్ల ధరల వివరాలను మాత్రం ఎలాన్ మస్క్ వెల్లడించలేదు.