Tibet : టిబెట్లో గురువారం భూకంపం సంభవించింది. నేపాల్ సరిహద్దులో 5.0 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఈ భూకంపం కారణంగా నేపాల్లోనే మరోసారి ప్రజల్లో ఆందోళన నెలకొంది. గత వారమే నేపాల్లో భారీ వరదలు సంభవించి 1200 మందికిపైగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ వరదలకు గల కారణాలపై ఇంకా ఒక స్పష్టత లేదు. అలాంటిది మరోసారి అదే నేపాల్ సరిహద్దు ప్రాంతంలో.. టిబెట్ దేశంలో భూకంపం నమోదు కావడం ఆందోళనకు గురిచేసింది.
స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.46 గంటల సమయంలో, భూమికి 14 కిలో మీటర్ల లోతున ఈ భూకంపం నమోదైనట్లు ఇండియాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. అయితే, ఈ భూకంపం వల్ల ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించలేదని తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని టిబెట్ ఇంకా వెల్లడించాల్సి ఉంది. గత ఆగష్టు 26న నేపాల్ సరిహద్దు ప్రాంతంలో, టిబెట్లో ఒక మంచు ఫలకం కూలిపోయింది. దీంతో పర్వత ప్రాంతంలోని నదులు ఉప్పొంగి పెద్ద విధ్వంసం సంభవించిన సంగతి తెలిసిందే. నేపాల్తోపాటు టిబెట్లోనూ వరద ప్రభావం కనిపించింది.
ఇక, నేపాల్ మృతుల సంఖ్య 1,252కు చేరింది. ఇంకా మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. మరోవైపు మళ్లీ నేపాల్కు వరద ముప్పు పొంచి ఉంది. అనేక నదులు పొంగి ప్రవహించే ప్రమాదం ఉంది. ఇంకా అక్కడ వర్షాలు పడుతుండటంతో భోటెకోషి నది ఉప్పొంగుతోంది. మంచు పర్వతం కూలడం వల్లే ఇటీవల నేపాల్లో వరదలు సంభవించాయనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయంలో నిపుణుల నుంచి ఇంకా ఏకాభిప్రాయం రావాల్సి ఉంది.