UAE | దుబాయ్, అబుదాబి లాంటి గల్ఫ్ దేశాలు పర్యాటకులకు స్వర్గధామం. ఓ పక్క చమురు నిల్వలు, మరోపక్క పర్యాటకుల సందర్శనతో ఈ దేశాలకు భారీగా ఆదాయం సమకూరుతోంది. దీంతో పర్యాటకుల కోసం గల్ఫ్ దేశాలు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తుంటాయి. అయితే అక్కడ తరాలుగా అమల్లో ఉన్న కఠినమైన చట్టాలు, ఇస్లామిక్ నిబంధనలతో కొంత అసౌకర్యం ఏర్పడుతోంది. ఈ నిబంధనల కారణంగా, అంతర్జాతీయంగా, ఆర్థికంగా నష్టపోతామని గ్రహించిన యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) పలు నిబంధనలను సడలిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. అక్కడ మద్యం విక్రయాలపై కీలక నిర్ణయం తీసుకుంది.
పార్టీలు, ఇతర కారణాలతో వివిధ దేశాల నుంచి సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, టూరిస్ట్లు ఏటా యూఏఈకి పోటెత్తుతుంటారు. దీంతో పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు.. మద్యం విక్రయాలపై విధిస్తున్న 30 శాతం పన్నును ఎత్తివేస్తూ యూఏఈ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో అరబ్ దేశాల్లో ఇంట్లో మద్యం సేవించాలన్నా కొంత డబ్బు చెల్లించి వ్యక్తిగత లైసెన్స్ పొందాల్సి ఉండేది. ఇప్పుడు మద్యం విషయంలో చట్టాలను సవరిస్తూ జనవరి 1న దుబాయ్ రాజ కుటుంబం ఈ ప్రకటన చేసింది. విదేశీ పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు మద్యంపై ట్యాక్స్ తగ్గించింది.
దుబాయ్ చట్టాల ప్రకారం.. ముస్లింలు మద్యం తాగడానికి వీల్లేదు. ఇతరులు మద్యం సేవించాలంటే వీసా కలిగి, 21 ఏళ్లు దాటిన వారై ఉండాలి. కానీ, ఇప్పుడు ఈ చట్టాలను సవరించడంతో పాటు మద్యం ధరలు కూడా తగ్గించింది. దాంతో, విదేశీ పర్యాటకులకు ఊరట కలుగుతుందని గల్ఫ్ దేశం భావిస్తోంది.