Middle East War : ఇరాన్ క్షిపణి దాడులతో దుబాయ్ సహా గల్ఫ్ దేశాల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ముఖ్యంగా అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తమ పౌరుల్ని రక్షించేందుకు ఆయా దేశాలు కీలక చర్యలు తీసుకుంటున్నాయి. దీనిలో భాగంగా దుబాయ్ ప్రభుత్వం అక్కడి ప్రజల మొబైల్ ఫోన్లకు మిస్సైల్ దాడులపై అలర్ట్స్ అందించనుంది.
ఇప్పటికే కొందరు దీనికి సంబంధించిన అలర్ట్స్ను తమ మొబైల్ ఫోన్లలో అందుకున్నారు. ఈ ప్రాంతంలో మిస్సైల్ దాడి జరిగే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అలర్ట్స్లో సూచిస్తున్నారు. అలాగే నివాసాల్ని వీడి బయటకు రావొద్దని సూచించారు. కొద్ది రోజులుగా దుబాయ్పై ఇరాన్ క్షిపణి దాడులతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. తమ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేయడంతో ప్రతిదాడిగా గల్ఫ్ కంట్రీస్పై ఇరాన్ దాడి చేస్తోంది. దీంతో దుబాయ్లోని అనేక చోట్ల మిస్సైల్ దాడులతో భారీ నష్టం జరుగుతోంది. పలు భవనాలు, ఆస్తులు ధ్వంసం అయ్యాయి. స్థానిక ప్రజలు తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నారు. దాడుల కారణంగా దుబాయ్ ఎయిర్పోర్టులో విమాన సేవలు నిలిచిపోయాయి. ఇది ప్రపంచంలోనే బిజీగా ఉండే ఎయిర్పోర్టులో ఒకటి.
అయితే, ఇక్కడి సేవల్లో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దుబాయ్లో కొందరు భారతీయులు కూడా చిక్కుకున్నారు. వారిలో చాలా మంది గత ఆదివారం ఇండియా తిరిగొచ్చారు. ఇంకా గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు చాలామంది పౌరులు తిరిగి వస్తున్నారు. ఇక.. గల్ఫ్ దేశాలు తాము యుద్ధంలో పాల్గొనబోమని చెబుతున్నాయి. తమ రక్షణ కోసం మాత్రమే స్పందిస్తామని చెబుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్లతో తాము యుద్ధం చేయబోమని యూఏఈ వెల్లడించింది.