ప్రపంచంలోని దేశాలలో పర్యాటకానికి, ఉద్యోగ అవకాశాలకు ప్రసిద్ధి పొందిన దుబాయ్ ఇప్పుడు మరో రికార్డును సొంతం చేసుకుంది. యూఏఈ(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)లోని ప్రధాన నగరం అయిన దుబాయ్ 100 శాతం పేపర్లెస్ గవర్నెన్స్ అందస్తున్న ప్రభుత్వంగా మారింది. దీంతో ప్రపంచంలోనే మొట్టమొదటి పేపర్ లెస్ గవర్నమెంట్గా చరిత్ర సృష్టించింది.
అక్కడి ప్రభుత్వానికి సంబంధించి అన్ని రకాల అంతర్గత, బాహ్య సేవలను, ట్రాన్సాక్షన్స్ను వంద శాతం డిజిటల్ ఫార్మట్లోనే కొనసాగిస్తూ ఈ ఘనత సాధించింది. దీనికి సంబంధించి ఎమిరేట్స్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధికార ప్రకటన విడుదల చేశారు. దుబాయ్ ప్రయాణంలో కొత్త దశ ప్రారంభమైందని, ఆవిష్కరణ, సృజనాత్మకత, భవిష్యత్తుపై దృష్టి కేంద్రీకరించే ప్రయాణం ఇది అని షేక్ హమ్దాన్ ఆ ప్రకటనలో తెలిపారు.
పేపర్లెస్ గవర్నెన్స్ ద్వారా.. 14 మిలియన్ గంటల మనిషి శ్రమను, 1.3 బిలియన్ దిర్హమ్(350 మిలియన్ డాలర్లు) ఆదా చేసినట్లు షేక్ హమ్దాన్ పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ ఘనత సాధించడం వల్ల ప్రపంచానికే డిజిటల్ రాజధానిగా దుబాయ్ నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దుబాయ్లో పేపర్లెస్ స్ట్రాటజీని ఐదు వరుస దశల్లో అమలు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రపంచంలోనే ధనిక నగరాల్లో ఒకటిగా ఉన్న దుబాయ్లో జనాభా 35 లక్షలు కాగా.. మెట్రో ఏరియాలో జనాభా 29 లక్షలకు పైగా ఉంది.
ఇదిలా ఉంటే అమెరికా, యూకే, యూరప్ దేశాల్లోని ప్రభుత్వాలు సైతం డిజిటల్ వ్యవస్థ బలోపేతానికి కృషి చేశాయి. కానీ, సైబర్ దాడుల భయంతో ఆ ప్రయత్నం కాస్తా నెమ్మదించింది.